బీఆర్ఎస్ కు ‘జూన్’ గండం ?

ట్యాపింగ్ విచారణపై కేసీఆర్ లో పెరిగిపోతున్న టెన్షన్ అర్ధమైపోతోంది;

Update: 2025-06-03 08:06 GMT
KCR, KTR and Harish Rao

బీఆర్ఎస్ కు జూన్ నెల చాలా కీలకంగా మారబోతోంది. ఎలాగంటే ఈనెలలోనే ముగ్గురు అగ్రనేతలు విచారణలకు హాజరవబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై 11వ తేదీన పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్(KCR) విచారణకు హాజరుకాబోతున్నారు. 9వ తేదీన మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) కూడా ఇదే విచారణకు హాజరవుతున్నారు. అలాగే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. మే నెలలోనే విచారణకు హాజరవ్వాల్సున్నా విదేశీ టూర్ నుండి వచ్చిన తర్వాత హాజరవుతానన్న కేటీఆర్ విజ్ఞప్తికి ఏసీబీ అధికారులు ఓకే చెప్పారు. దాంతో కేటీఆర్ విదేశాల నుండి రాగానే విచారణకు హాజరవ్వక తప్పదు. ఇదేసమయంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకరరావు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు 5వ తేదీన హాజరవుతున్నారు.

తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) కేసులో సూత్రదారిగా కేసీఆర్ పైన చాలా ఆరోపణలున్నాయి. ట్యాపింగ్ కేసులో కీలక పాత్రదారి టీ. ప్రభాకరరావు గనుక విచారణలో నోరిప్పితే కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు కూడా కష్టాలు తప్పేట్లు లేదు. టెలిఫోన్ ట్యాపింగ్ కు తనకు ఏమిటి సంబంధమని కేసీఆర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో ఆమధ్య ఎదురుదాడిచేశారు. ట్యాపింగ్ అంశం పూర్తిగా పోలీసు శాఖకు సంబందించిన విషయమని తేలికగా కొట్టేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. కేసీఆర్ చెప్పింది ఎలాగుందంటే ప్రభుత్వానికి పోలీసు శాఖకు ఎలాంటి సంబంధంలేదన్నట్లుగా ఉంది. ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పోలీసుశాఖకు కూడా ఒకటని, దానికి కూడా తానే అధిపతి అన్న విషయం జనాలకు తెలీదన్నట్లుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. దీంతోనే ట్యాపింగ్ విచారణపై కేసీఆర్ లో పెరిగిపోతున్న టెన్షన్ అర్ధమైపోతోంది. క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులను గమనిస్తే బీఆర్ఎస్ కు జూన్ గండం తప్పేట్లు లేదనే అనిపిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అవకతవకలకు కేసీఆరే బాధ్యుడన్న విషయం పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన 110 మందిలో అత్యధికులు అఫిడివిట్లు సమర్పించినట్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈవిషయాన్ని కేసీఆర్ ఎలాగూ అంగీకరించరు. టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై చెప్పినట్లే ఇపుడు కూడా కాళేశ్వరంలో అవినీతి, అవకతవకలు జరిగుంటే అందుకు అధికారులు, నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ దే బాధ్యతన్నట్లుగా వాదిస్తారు. ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పేందుకు లేదు. అవినీతి జరిగింది కాబట్టే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు మూడు కుంగిపోయాయి. పిల్లర్లు కుంగిపోయిన ఫలితంగానే బ్యారేజీ ప్లాట్ ఫారమ్ లో పగుళ్ళొచ్చేశాయి. దీంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీలో నీటినిల్వ సమస్యగా మారింది. అవినీతి, అవకతవకలు జరిగాయి కాబట్టి వేలకోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు, బ్యారేజీలు పనికిరాకుండా పోయాయి.

కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణ తర్వాత వీళ్ళపాత్రపై కమిషన్ ఎలాంటి రిపోర్టు ఇవ్వబోతోందన్నది ఆసక్తిగా మారింది. కమిషన్ ఇవ్వబోయే ఫైనల్ రిపోర్టు మీద రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం ఏ విధంగా ? ఎవరిపైన యక్షన్ తీసుకుంటుందన్నది ఆధారపడుంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసు(Formula E car race) విచారణకు కేటీఆర్(KTR) హాజరవ్వాల్సుంది. విదేశాల నుండి తిరిగిరాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసీబీ విచారణకు హాజరవుతారు. ఈ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారన్న విషయంలో ఆధారాల సంగతేమో కాని అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు చాలా ఆధారాలున్నాయి. అవేమిటంటే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోకుండా బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ ఖాతానుండి పౌండ్లలో రు. 45 కోట్లు చెల్లించటం.

నిధుల చెల్లింపుకు ముందు క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు, చివరకు రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా తీసుకోలేదు. విదేశాలకు విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే ముందుగా ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. విషయం తెలిసిన తర్వాత ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్ల జరిమానా విధించింది. మంత్రి హోదాలో కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే తెలంగాణ ప్రభుత్వం రు. 8 కోట్ల జరిమానాను చెల్లించాల్సొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కోట్లరూపాయల జరిమానాను చెల్లించింది అంటేనే తప్పుచేసినట్లు అంగీకరించిందని అర్ధం. తప్పు ఎందుకు చేసిందంటే కేటీఆర్ కారణంగానే అన్నది క్లియర్. అధికార దుర్వినియోగం ఇంత స్పష్టంగా బయటపడింది కాబట్టి అందుకు బాధ్యత అధికారులదే అని కేటీఆర్ వాదించి బాధ్యతనుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కొడుకు, మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాలు పాటించటం కుదరదని ఏ అధికారి అయినా చెప్పగలరా ? కేటీఆర్ ఫోన్లో ఆదేశిస్తేనే హెచ్ఎండీఏ నుండి నిధులు చెల్లించినట్లు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమీషనర్ గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో కేటీఆర్ ను ఇప్పటికే ఏసీబీ, ఈడీ రెండుసార్లు విచారించాయి. మరి మూడోసారి విచారణలో ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది.

ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా చాలా కీలకమనే చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయి. ఇదంతా కూడా నియమ, నిబంధనలకు విరుద్ధంగానే జరిగింది. బీఆర్ఎస్(BRS) ప్రత్యర్ధిపార్టీల నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, అనుమానం ఉన్న సొంతపార్టీ నేతలు, చివరకు కొందరు జడ్జీలతో పాటు వారి కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయి. వేలాది మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ కు ప్రధాన కారకుడు కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన టీ ప్రభాకరరావు. ప్రభాకరరావు చెబితేనే తాము మొబైల్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అరెస్టయిన పోలీసు అధికారులు ప్రణీత్ రావు, తిరుపతన్న, కిషన్ రావు, భుజంగరావు ‘సిట్’ విచారణలో ఇప్పటికే అంగీకరించారు. అయితే వేలాది ఫోన్లను ట్యాప్ చేయాలని ప్రభాకరరావుకు ఆదేశాలిచ్చింది ఎవరన్న విషయం మాత్రమే తేలాలి. విచారణ నుండి తప్పించుకునేందుకు అమెరికా(America)లో కూర్చుని 14 మాసాలు ప్రయత్నించిన నిందితుడు చివరకు ఇండియాకు వచ్చి సిట్ విచారణకు హాజరుకాక తప్పలేదు. 5వ తేదీన సిట్ విచారణకు ప్రభాకరరావు హాజరవుతున్నారు. నిందితుడు గనుక అప్రూవర్ గా మారిపోతే కేసీఆర్, కేటీఆర్ కు తిప్పలు తప్పవన్న విషయం అర్ధమైపోతోంది.

ఈ డెవలప్మెంట్లన్నీ గమినిస్తుంటే బీఆర్ఎస్ కు జూన్ నెల గడ్డునెలన్న విషయం అర్ధమైపోతోంది. కాళేశ్వరం విచారణకు కేసీఆర్, హరీష్ రావు హాజరై తన వాదన ఏమైనా వినిపించుకోవచ్చు. అయితే వాళ్ళ వాదన తర్వాత కమిషన్ ఏమి రిపోర్టు ఇస్తుందన్నదే ఇక్కడ కీలకం. ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన వారిలో అత్యధికులు అవినీతి, అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్, హరీష్, నిర్మాణ కంపెనీదే అని అఫిడవిట్లు దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాబట్టి విచారణకు హాజరవ్వటం ఒక ఎత్తయితే విచారణ తర్వాత జరగబోయే పరిణామాలు మరింత కీలకంగా మారబోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News