కాళేశ్వరం వేట మొదలవుతోందా ?
షోకాజ్ నోటీసులు జారీచేయటం సోమవారం లేదా మంగళవారం నుండి మొదలవ్వబోతోందని అర్ధమవుతోంది;
తొందరలోనే కాళేశ్వరం వేట మొదలుపెట్టాలని ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఇందుకోసం విజిలెన్స్ శాఖ పెద్దఎత్తున కసరత్తు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మాణంలో అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణలో తేలిన వాళ్ళపై డైరెక్టుగా క్రిమినల్ కేసులు పెట్టాలా లేకపోతే ముందు శాఖాపరమైన నోటీసులు ఇచ్చి సమాధానాలు రాబట్టి తర్వాత కేసులు పెట్టాలా ? అన్న విషయమై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని క్లారిటి కోరినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు అధికారులు రెండునెలలు దర్యాప్తు చేసి రిపోర్టు తయారుచేసి ప్రభుత్వానికి అందించారు.
రేవంత్(Revanth) ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు రిపోర్టు మార్చి 18వ తేదీన అందించింది. రిపోర్టు ప్రకారం సూపరెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ గా పనిచేసిన 17 మందిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసుచేసింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మరో 33 మందిపై శాఖాపరమైన యాక్షన్ తో పాటు భారీ జరిమానాలు విధించాలని చెప్పింది. ఎవరిపైన, ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపాలనే విషయాన్ని కూడా ఎన్ఫోర్స్ మెంటు అధికారులు ఒక్కో అధికారిగురించి చాలా డీటైల్డ్ గా వివరించారు.
ఎవరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే విషయాన్ని విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం కసరత్తు చేస్తున్నట్లు ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాకులో మూడు పిల్లర్లు కుంగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతోనే కాళేశ్వరం నిర్మాణపనుల్లో భారీ అవినీతి, అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు పెరిగిపోయాయి. ఎన్ఫోర్స్ మెంటు రిపోర్టులో తప్పుపట్టిన ఉన్నతాధికారులు, అధికారులపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ? అందుకు అనుసరించాల్సిన విధానంపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ప్రిన్సిపుల్ సెక్రటరీ రాహూల్ బొజ్జా, ప్రత్యేకకార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తో సుదీర్ఘంగా చర్చించారు. తీసుకోవాల్సిన యాక్షన్ పై నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాధ్ దాస్ కు అధికారాలు అప్పగించినట్లు అధికారవర్గాల సమాచారం. విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం సోమవారం అందరికీ షోకాజ్ నోటీసులు జారీచేసి తర్వాత ఏమిచేయాలో డిసైడ్ చేయబోతున్నారు.
రిపోర్టు ప్రకారమైతే 17 మంది ఉన్నతాధికారులతో పాటు నిర్మాణసంస్ధ ఎల్ అండ్ టీపైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి. వీళ్ళవల్లే మేడిగడ్డ బ్యారేజీకి తీవ్రమైన నష్టం జరిగిం కాబట్టి ఐపీసీ సెక్షన్లు 120(బి), 336, 409, 418, 423, 426 కింద, పీసీ యాక్టు, డ్యాం సేఫ్టి యాక్ట్-2021, పీడీపీపీ యాక్ట్-1984 ఆధారంగా అందరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రిపోర్టులో ఎన్ఫోర్స్ మెంటు అధికారులు రిపోర్టు ఇచ్చారు. చేయాల్సిన పనులను పూర్తిచేయకుండానే పూర్తయిపోయినట్లు ఎల్ అండ్ టీ సంస్ధ సర్టిఫికేట్ ఎలాగ తీసుకుంది ? సంస్ధకు సర్టిఫికేట్ ఇచ్చింది ఎవరు ? సర్టిఫికేట్ ఇవ్వమని ఉన్నతాధికారులను ఒత్తిడిచేసింది ఎవరనే విషయాలు తెలియాలి. ఏడో బ్లాకులో పిల్లర్ల పునర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని నిర్మాణ సంస్ధ నుండే వసూలు చేయాలని రిపోర్టులో ఉంది.
ప్రభుత్వవర్గాల సమాచారం ప్రకారం అందరికీ ముందు షోకాజ్ నోటీసులు జారీచేయటం సోమవారం లేదా మంగళవారం నుండి మొదలవ్వబోతోందని అర్ధమవుతోంది. ఇదే జరిగితే కాళేశ్వరం వేట మొదలవబోతోందని అనుకోవాలి. ఒకసారి షోకాజ్ నోటీసులు జారీఅయితే తర్వాత వాళ్ళ సమాధానాలు చూసుకుని అందరిపైనా క్రిమినల్ యాక్షన్లో భాగంగా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయటమే మిగిలింది. అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారుతుంది.