ఈటల రాజేందర్ కు ‘కాళేశ్వర’మే మైనస్ అయ్యిందా ?

తొలినుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి అంశం చర్చకు వచ్చినపుడల్లా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) పేరు తప్పనిసరిగా చర్చకు వచ్చేది;

Update: 2025-06-30 06:20 GMT
Malkajgiri BJP MP Eatala Rajendar

తొలినుండి తెలంగాణ బీజేపీ అధ్యక్షపదవి అంశం చర్చకు వచ్చినపుడల్లా మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) పేరు తప్పనిసరిగా చర్చకు వచ్చేది. బీసీ సామాజికవర్గం అవటం, ఎంఎల్ఏగా ఐదుసార్లు గెలిచి, మంత్రిగా పనిచేయటం ఈటలకు బాగా కలిసి వస్తుందని అందరు అనుకున్నారు. అయితే చివరినిముషంలో అధ్యక్షపదవి రేసునుండి ఈటల తప్పుకోవాల్సొచ్చింది. అధిష్ఠానం ఈటల పేరును పరిశీలించినా చివరకు పక్కకుపెట్టేసినట్లు సమాచారం. కారణం ఏమిటంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తర్వాత ఈటల మాట్లాడిన మాటలే బాగా మైనస్ అయినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.

పీసీఘోష్ కమిషన్ విచారణకు బీజేపీ అధ్యక్షపదవి రాకపోవటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే కమిషన్ విచారణ తర్వాత ఈటల మీడియాతో మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజి నిర్మాణాలు క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పారు. కమిషన్ విచారణలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తెలంగాణ అదృష్టంగా చెప్పారు. ఈటల మాటలు విన్నవాళ్ళకు కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు అనిపించింది. కాళేశ్వరం నిర్మాణంపై క్యాబినెట్ లో చర్చించలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. దాంతో ఈటల చెప్పింది అబద్ధమని తేలిపోయింది.

గతంలో నరేంద్రమోదీ(Narendra Modi) తెలంగాణ పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఫ్యామిలి ఏటీఎంలాగ ఉపయోగించుకున్నట్లు తీవ్రంగా ఆరోపించారు. ఇలాంటి ఆరోపణలనే అమిత్ షా(Amit Shah) కూడా చేశారు. మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్(KCR) ఫ్యామిలీపై తీవ్రంగా ఆరోపణలు గుప్పిస్తుంటే ఈటల మాత్రం మద్దతిచ్చేట్లుగా మాట్లాడారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణం క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగిందని చెప్పటం పార్టీలో బాగా వివాదాస్పదమైంది. ఎందుకంటే కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) తో పాటు పార్టీ ఎంపీలు, ఎంఎల్ఏలు ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంటే ఈటల సాఫ్ట్ కార్నర్ తో మాట్లాడుతున్నారు.

ఇదేవిషయమై కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలు ఈటలపై కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదుచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ పరిణామంతో ఈటల పార్టీలో ఒంటరి అయిపోయారు. ఒకపుడు కేసీఆర్ కు ఈటల బలమైన మద్దతుదారుడుగా ఉండేవారు. అలాంటిది ఇద్దరి మధ్యా చెడటంతో ఈటలను కేసీఆర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయటమే కాకుండా పార్టీలో నుండి తిరిమేశారు. పార్టీలో నుండి బయటకు వచ్చిన కొత్తల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఫ్యామిలిపై ఈటల అనేక ఆరోపణలతో విరుచుకుపడ్డారు. అలాంటిది ఇపుడు కేసీఆర్ ఫ్యామిలి వైఖరిపై ఈటల స్టాండ్ మారిందా అనేఅనుమానాలు వచ్చేట్లుగా మాట్లాడుతున్నారు.

దాంతో కేసీఆర్ విషయంలో ఈటలఆలోచనల్లో మార్పువచ్చిందా అనే అనుమానాలు అందరిలోను పెరిగిపోతున్నాయి. దానికితోడు కమిషన్ విచారణకు ముందు ఈటలతో హరీష్ రావు(Harish Rao) భేటీ అయ్యారనే ప్రచారం బాగా జరిగింది. ఇలాంటి అనేక విషయాలపై పార్టీలోని సీనియర్ నేతలు ఈటలపైన జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుత విషయానికి వస్తే అధ్యక్షపదవి రేసులో ఈటలతో పాటు ఎంపీలు ధర్మపురి అర్వింద్, రఘునందనరావు, డీకే అరుణ పేర్లు బలంగా వినిపించాయి. అధ్యక్షుడిగా ఎవరిని ఎంపికచేస్తే బాగుంటుందనే విషయమై నాయకత్వం రాష్ట్రంలోని నేతల అభిప్రాయాలు సేకరించింది. ఆశ్చర్యంగా సీనియర్ నేతల్లో మెజారిటి+ఆర్ఎస్ఎస్ నేతలు మాజీ ఎంఎల్సీ రామచంద్రరావుకు మద్దతిచ్చినట్లు పార్టీ వర్గాల టాక్.

అధ్యక్ష రేసులో బీసీ నేతలను పక్కనపెట్టడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిని చేస్తామని స్వయంగా మోదీ బహిరంగసభలో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బీసీని ప్రకటించిన కారణంగా, ఇప్పటివరకు అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి కొత్త అధ్యక్షుడిగా రామచంద్రరావు(బ్రాహ్మణుడు)ను నియమించాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయ్యింది. ఒక సమయంలో బండి పేరును కూడా పరిశీలించినా గతంలో అధ్యక్షుడిగా చేసుండటంతో పాటు బండి కూడా కేంద్రమంత్రిగానే ఉండేందుకు మొగ్గుచూపినట్లు సమాచారం. బండి విషయంలో కూడా బీసీ ఈక్వేషన్ అడ్డొచ్చినట్లు తెలిసింది.

రామచంద్రరావు గతంలో అధికారపార్టీ ప్రతినిధిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. పార్టీలోని అందరు నేతలతో మంచిసంబంధాలున్న నేత. అలాగే జాతీయ నేతలతో కూడా మాజీ ఎంఎల్సీకి సన్నిహిత సంబంధాలుండటమే కాకుండా వివాదరహితుడుగా పేరుంది. రామచంద్రరావుకు ఎంపికకు ఎన్ని పరిస్ధితులు సానుకూలమయ్యాయో, ఈటలకు అన్నిపరిస్ధితులు మైనస్ అయినట్లు తెలుస్తోంది. హోలు మొత్తంమీద అర్ధమవుతున్నది ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో ఈటల సానుకూలంగా మాట్లాడటమే అతిపెద్ద మైనస్ అయినట్లు అర్ధమవుతోంది. అందుకనే అధ్యక్షపదవి రేసునుండి పక్కకు తప్పించేశారు.

Tags:    

Similar News