‘మంత్రివర్గాన్ని కూర్చుకోలేని సీఎం.. పాలనేం చేస్తారు’

తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది.;

Update: 2025-06-14 08:20 GMT

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎన్నడూ రేవంత్ అంత బలహీనమైన ముఖ్యమంత్రిని చూడలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదని, వాటిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు అంటగడుతున్నారని మండిపడ్డారు. శనివారం కొందరు విద్యార్థి నాయకులు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ కవిత.. కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలి ’’ అని పిలుపునిచ్చారు.

‘‘బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదు. బీసీలకు 42 రిజర్వేషన్లకు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోము. 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి. కర్నాటకలో కులగణన ఎలా చేయాలో అక్కడి సీఎం సిద్దరామయ్యకు నేర్పించానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. సీఎం ఈ ప్రకటన చేసిన గంట సేపటికే కాంగ్రెస్ అధికారికంగా ఒక ఫోటో విడుదల చేసింది. ఆ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం లేరు. దీన్ని బట్టే రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో అర్థమవుతోంది’’ అని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలి. ఆర్ఎస్ఎస్ స్కూల్, టీడీపీ కాలేజీలో చదువుకున్నానని.. జాబ్ కాంగ్రెస్ లో చేస్తున్నానని సీఎం అన్నారు. చేస్తున్న జాబ్ లో కూడా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు రావడం లేదు. ఢిల్లీకి వెళ్లడంలో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ చేశారు. కనీసం మంత్రివర్గాన్ని కూర్పు చేసుకోలేని సీఎం రేవంత్ రెడ్డి. ఇంత అసమర్థ, బలహీన ముఖ్యమంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇంత బలహీనంగా లేకుండే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. విద్యార్థల సమస్యలు, విద్యారంగ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 8 వేల కోట్ల మేర ఫీజు రియింబర్స్ మెంటు బకాయిలు ఉన్నాయి. తక్షణమే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్య భరోసా కార్డులు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని విస్మరిస్తోంది. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలి’’ అని కోరారు.

Tags:    

Similar News