జ్యోతిరావు పూలే విగ్రహం కోసం కవిత నిరసన
కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయము. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందాం. చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైంది. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.;
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటుకై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చాలా ప్రమాదముందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు... ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు.. అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉంది. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణనను తప్పదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారు. అసెంబ్లీలో పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించి అధ్యయనం చేసిన తర్వాత రిజర్వేషన్ ఇస్తారంట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్ సైట్ లో పెట్టాము. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఆ ధైర్యం లేదు ?’’ అని ఎద్దేవా చేశారు.
‘‘2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదు. తెలంగాణలో చేసిన కులగణన వివరాలను వెల్లడించలేదు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి చేయాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో మేము కూడా కలిసి వస్తాం. కానీ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో దొంగ దీక్షలు చేయము. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు కూర్చుందాం. చట్టసభలు బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైంది. ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి’’ అని ప్రశ్నించారు.
‘‘గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా... లేదా రాష్ట్రపతికి పంపించారా ? బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారు. కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి వెళ్లలేదు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేది. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదు. దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారు. ధర్నాకు రాహుల్ గాంధఈ వస్తారని ఊదరగొట్టారు కానీ చివరికి ఆయన రాలేదు’’ అని చురకలంటించారు.
‘‘ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడారు. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాటల్లో మాట్లాడాలి. కులగణన అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన సంస్థ హెచ్చరిక చెబుతోంది. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి. చిత్తశద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టండి. ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలి. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే. పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారు. మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలే’’ అని వ్యాఖ్యానించారు.
‘‘కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తాం. ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్పా... వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఏప్రిల్ 11న పూలే విగ్రహంపై ప్రభుత్వం ప్రకటన చేయాలి. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించాం’’ అని తెలిపారు.