భూభారతి చట్టంతో నా జన్మధన్యం
తెలంగాణ ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే చట్టమే భూభారతి అని, ప్రజలకు ఈ చట్టాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.;
తెలంగాణను భూవివాద రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థే ‘భూభారతి’. దీనిని ఈరోజు ఉదయం సీఎం సహా మంత్రులు కలిసి అధికారికంగా ప్రారంభించారు. ప్రజలకు ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిస్కరం చూపడమే ఈ వ్యవస్థ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో తన జన్మధన్యమైందన్నారు. తెలంగాణ ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే చట్టమే భూభారతి అని, ప్రజలకు ఈ చట్టాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘గత ప్రభుత్వ దొరల హయాంలో నాలుగు గోడల మధ్య నలుగురు కలసి రూపొందించిన 2020 రెవెన్యూ చట్టం- ధరణితో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని, రెవెన్యూ వ్యవస్ధ కూడా తెల్లవారు ఝూమున దొరగారి మదిలో మెదిలిన ఆలోచనలకు అనుగుణంగా పరిగెత్తలేకపోయారు. అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఈ చట్టాన్ని స్వార్దప్రయోజనాలకోసం ఉపయోగించుకోవడానికి గ్రామపరిపాలనాధికారుల వ్యవస్దను కూడా నాడు రద్దు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇతర సహచర మంత్రులు ఎంతో కృషి చేసి రూపొందించిన ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే బి ఆర్ ఎస్ సభ్యులు ఏ విధంగా అపహాస్యం చేశారో, అడ్డుకోవడానికి ప్రయత్నించారో గమనించాలి. అయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నేటితో నిలబెట్టుకున్నాం’’ అని తెలిపారు.
‘‘2020 రెవెన్యూ చట్టం మూడేళ్లలో మురిగిపోగా, నేటి 2025 భూభారతి చట్టం వందేళ్లు వర్ధిల్లుతుంది. ఈ చట్టాన్ని సమర్ధవంతంగా ప్రజలకు అందించేందుకు గాను 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశాం. ఖమ్మం, మెహబూబ్నగర్, ములుగు, కామారెడ్డి జిల్లాలను ఎంపికచేశాం. అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలో అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. రాష్ట్రంలో అన్నివర్గాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని , భేషిజాలకు పోకుండా అవసరమైన మార్పులు చేసి జూన్ 2 తేదీనాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తాం’’ అని చెప్పారు.
‘‘మే మొదటివారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాలలో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి సమస్యలను స్వీకరించి భూభారతి చట్టాన్ని పటిష్టపరుస్తాం. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సవరిస్తాం. దీనికోసం ఎమ్మార్వో స్దాయిలో అధికారుల బృందం పనిచేస్తుంది. చట్టాన్ని ప్రజల కోసం ఇందిరమ్మ ప్రభుత్వం రూపొందించినా దీనిని సమగ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదే. పేద , దళిత, గిరిజనుల పరిస్ధితులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా భూభారతిని అమలు చేయాలని అధికారులను కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.