Aga Khan |ముస్లింల గురువు కరీం అల్-హుస్సేనీ ఆగాఖాన్ కన్నుమూత
ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు కరీం అల్-హుస్సేనీ ఆగాఖాన్ కన్నుమూశారు. ఆగాఖాన్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.;
By : The Federal
Update: 2025-02-05 06:05 GMT
ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువుగా నియమితులైన కరీం అల్-హుస్సేనీ ఆగా ఖాన్ -4 కన్నుమూశారు. పద్మవిభూషణ్ గ్రహీత ఆగాఖాన్ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆగాఖాన్ మరణం మానవాళికి తీరని లోటు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
- గొప్పసామాజిక వేత్త, మానవతావాదిగా ఆగా ఖాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందారని సీఎం పేర్కొన్నారు. ఆగాఖాన్ నెట్ వర్క్ ద్వారా వివిధ దేశాల్లో ఆస్పత్రులు, విద్యా, సాంస్కృతిక సంస్థలను నెలకొల్పి మానవాళికి తన సేవలను అందించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
- పేదరిక నిర్మూలన, వారసత్వ సంపద పరిరక్షణకు, వైద్య సేవలు, విద్యా రంగంలో ఆయన అందించిన సేవలు మరిచిపోలేనివని సీఎం చెప్పారు. హైదరాబాద్ కేంద్రంగా ఆగా ఖాన్ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో గొప్పవని ముఖ్యమంత్రి చెప్పారు. ఆగాఖాన్ జీవితాంతం మానవ జాతి గౌరవం పెంచే ఉన్నత విలువలను ఆచరించారని సీఎం కొనియాడారు. వారి వారసులకు, కుటుంబసభ్యులకు, అనుచరులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.