నాగార్జున ట్విట్టర్లో నుండి బయటకురావాలి

సినిమాల్లోనే కాదు బయటకూడా తాను హీరోయే అని నిరూపించుకోవాల్సిన అగత్యం ఇపుడు నాగార్జునపైనే ఉంది.

Update: 2024-08-26 07:04 GMT
Nagarjuna and N convention center

సత్యసందతను నిరూపించుకోవాల్సిన అవసరం ఇపుడు అక్కినేని నాగార్జునకు ఎదురైంది. సినిమాల్లోనే కాదు బయటకూడా తాను హీరోయే అని నిరూపించుకోవాల్సిన అగత్యం ఇపుడు నాగార్జునపైనే ఉంది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చేసినప్పటి నుండి వివాదానికి నాగార్జున కేంద్రబిందువైపోయారు. మాదాపూర్ లోని 29.6 ఎకరాల తుమ్మిడికుంట చెరువులో నాగార్జున 3.30 ఎకరాలను ఆక్రమించుకుని కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించుకున్నారని ఎప్పటినుండో ఆరోపణలున్న విషయం తెలిసిందే. చెరువు విస్తీర్ణం ఎంత, నాగార్జున ఆక్రమించుకున్న చెరువు ఎంత ? అందులో ఫుల్ ట్యాంక లెవల్ విస్తీర్ణం, బఫర్ జోన్ ఎంతన్న విషయం జనాలకు తెలీదు.

అయితే తాజాగా హైడ్రా కూల్చివేతల నేపధ్యంలో చెరువు విస్తీర్ణంలో నాగార్జున ఆక్రమించుకున్న భాగమెంత అందులో ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ వివరాలు గుగుల్ మ్యాపుల్లో స్పష్టంగా బయటపడింది. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో ఒక్కఅంగుళం భూమి కూడా చెరువును తాను ఆక్రమించలేదని మొదటినుండి నాగార్జున చెబుతున్నారు. ఆదివారం రాత్రి కూడా ఇదే విషయాన్ని అక్కినేని చెప్పారు. ఇదే సమయంలో హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు నాగార్జున ముమ్మాటికి చెరువును ఆక్రమించి నిర్మాణం చేశారని బల్లగుద్ది చెబుతున్నారు. తమ వాదనకు మద్దతుగా శాటిలైట్ , గూగు చిత్రాలను చూపిస్తున్నారు.

ఇక్కడే నాగార్జున వాదనను ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే చెరువును ఆక్రమించలేదని మాత్రమే నాగార్జున చెబుతున్నారు కాని తన వాదనను బలపరిచే డాక్యుమెంట్లను ఇప్పటివరకు చూపలేదు. ఎంతసేపు ట్విట్టర్లో కూర్చుని తాను సత్యసందుడినని అంటే సరిపోదు. బయటకు వచ్చి కన్వెన్షన్ సెంటర్ ఏరియాకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లను నాగార్జున చూపించాలి. పట్టాభూమిలో తాను సెంటర్ ను నిర్మించినట్లు చెబుతున్నారు. పట్టాభూమి ఎవరి దగ్గర నుండి కొన్నారు ? కొన్నభూమి ఎంత ? సెంటర్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుండి తీసుకున్న అనుమతుల వివరాలను మీడియా ముఖంగా జనాలందరికీ వివరించాలి.

వార్తల్లో వాస్తవంకన్నా ఊహాగానే ఎక్కువగా ఉన్నాయని బాధపడితే ఉపయోగంలేదు. వాస్తవాలు ఏమిటో నాగార్జునే జనాలకు వివరించాలి. అప్పుడే వాస్తవాలు ఏమిటి ? ఊహాగానాలు ఏమిటనేది జనాలకు అర్ధమవుతుంది. మామూలుగా అయితే తన ఆస్తుల గురించి, వ్యాపారాలగురించి జనాలకు చెప్పాల్సిన అవసరం నాగార్జునకు లేదు. కాని ఇపుడు కన్వెన్షన్ సెంటర్ వివాదంలో ఇరుక్కుంది. పైగా కన్వెన్షన్ సెంటర్ వివాదంపై ప్రచారాలను నమ్మవద్దని జనాలను విజ్ఞప్తి చేశారు. ప్రచారాలను, ఊహాగానాలను నమ్మవద్దని అన్నపుడు అసలు వాస్తవం ఏమిటో చెప్పాల్సిన బాధ్యత తనపైనే ఉందని నాగార్జున గ్రహించాలి.

ట్విట్టర్లో పోస్టులు పెడితే అభిమానులు, దగ్గరవాళ్ళు మద్దతిస్తారేమోకాని ప్రభుత్వం, కోర్టులు మద్దతు ఇవ్వవని నాగార్జునకు తెలీదా ? వివాదం కోర్టుకు ఎక్కింది కాబట్టి సాక్ష్యాలుగా డాక్యుమెంట్లను మాత్రమే పరిగణిస్తుంది. అంతకన్నా ముందు జనాలు తనను నమ్మాలంటే నాగార్జున మీడియా ముఖంగా డాక్యుమెంట్లను జనాలకు చూపించాల్సిందే. చెరువు ఆక్రమణకు గురికాలేదని ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ స్పెషల్ కోర్టు 24-02-2014న ఆర్డర్ ద్వారా జడ్జిమెంట్ ఇచ్చిందని అంటున్నారు. కానీ శాటిలైట్ చిత్రాల్లో చెరువును ఆక్రమించి ఇతర కట్టడాల్లాగే కన్వెన్షన్ సెంటర్ను కూడా నిర్మించినట్లు కనబడుతోంది. హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ కూడా ఇదే విషయాన్ని ప్రకటించారు. చెరువును ఆక్రమించి నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించుకున్నట్లు చెప్పారు. నాగార్జున చెబుతున్నట్లుగా గతంలో ఏ కోర్టు కూడా స్టే ఆదేశాలు ఇవ్వలేదని కూడా రంగనాధ్ అన్నారు.

ఇక్కడే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కూల్చివేతల్లో ఎవరి వాదన కరెక్టో జనాలకు అర్ధంకావటంలేదు. చెరువును ఆక్రమించిందే కాకుండా జీహెచ్ఎంసీ పర్మీషన్ లేకుండానే కన్వెన్షన్ సెంటర్ ను నాగార్జున కట్టేసినట్లు అధికారులు చెబుతున్నారు. అధికారులు చెప్పే తప్పయితే కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి తాను తీసుకున్న అనుమతులను నాగార్జున చూపించాలి. అప్పుడు జనాలకు ఒక క్లారిటి వస్తుంది. చెరువు ఆక్రమపై స్పెషల్ కోర్టు తీర్పు, హైకోర్టు స్టే కాపీ, నిర్మాణానికి అనుమతుల కాపీలను నాగార్జున చూపించినపుడే జనాలు నమ్ముతారు. చూపనంతవరకు ఊహాగానాలు, ప్రచారాలు, పుకార్లు, అవస్తాలు చెలామణి అవుతునే ఉంటాయని నాగార్జున ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

Tags:    

Similar News