తెలంగాణ మాజీ మంత్రికి కోపమొచ్చింది...

ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలి అంటున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

Update: 2024-06-12 12:55 GMT

"ఎన్నికల ప్రచారం మీద ఉన్న సోయి విధి, విధానాల రూపకల్పన మీద ఉండదా? ఏడు నెలల నుండి ముఖ్యమంత్రి, మంత్రులకు తీరిక లేదా? ఏ పథకం గురించి అడిగినా ముఖ్యమంత్రి, మంత్రులు దెయ్యానికి భయపడి వెనకటికి గోడల మీద ‘ఓ స్త్రీ రేపురా’ అని రాసి ఉండే కథను వినిపిస్తున్నారు. డిసెంబరు 9న రూ.15 వేల రైతు భరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు నీటి మీది రాతలే అని తేలిపోయింది" అంటూ తెలంగాణ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇప్పుడు రైతుభరోసాకు విధి, విధానాలు, ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి అని మల్లగుల్లాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఎందుకు రైతుభరోసాను పరిమితం చేస్తామని, సమీక్ష చేస్తామని చెప్పలేదు? అని ప్రశ్నించారు. "రైతుభరోసాకు దిక్కు లేదు. కౌలు రైతుల ఊసులేదు. రైతు కూలీల గురించి పట్టించుకున్న నాథుడు లేడు. వరికి రూ.500 బోనస్ వట్టి బోగస్ అని తేలిపోయింది. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే రైతుభరోసాను 5 ఎకరాలకో, 10 ఎకరాలకో పరిమితం చేస్తామని విధాన ప్రకటన చేయాలి" అని డిమాండ్ చేశారు.

"కేవలం కాలయాపన కోసమే శాసనసభ సమావేశాలు అంటూ ఊదరగొడుతున్నది. ప్రభుత్వానికి ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్ భేటీ ఏర్పాటు చేసి రైతుభరోసాపై తీర్మానం చేయాలి. రైతుభీమా ఉంచుతారా? ఎత్తేస్తారా? తేల్చిచెప్పాలి. రైతుకూలీలకు రూ.12000, కౌలు రైతులకు రూ.15000 ఇవ్వడంపై స్పష్టతనివ్వాలి. అబద్దపు హామీలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ రాష్ట్ర రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నది. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలి" అని నిరంజన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Tags:    

Similar News