ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులకు రేవంత్ లాయర్ క్లారిటీ

రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ తో బిజీగా ఉన్నందున ఆయన తరపు న్యాయవాది సౌమ్యా గుప్తా ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరయ్యారు.

Update: 2024-05-01 12:33 GMT

అమిత్ షా ఫేక్ వీడియోతో తనకి ఎలాంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే తాను ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నానని, ఇప్పుడు విచారణకి హాజరు కాలేనని తెలిపారు. ఈ మేరకు ఆయన తరపున టీపీసీసీ లీగల్ సెల్ న్యాయవాది సౌమ్య గుప్తా రాతపూర్వకంగా ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు.

రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిందని బీజేపీ నేతలు ఆరోపించారు. సదరు వీడియోని తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ లో పెట్టారని, ఆ ఫేక్ వీడియో ని కాంగ్రెస్ నేతలు షేర్ చేసి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు చేసింది. ఈ వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ నేతలతో పాటు, సీఎం రేవంత్ రెడ్డికి మే 1 న విచారణకి హాజరవ్వాలంటూ నోటీసులు అందాయి.

రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ తో బిజీగా ఉన్నందున ఆయన తరపు న్యాయవాది సౌమ్యా గుప్తా ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుట హాజరయ్యారు. అమిత్ షా ఫేక్ వీడియోతో సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ వీడియో పోస్ట్ చేసిన ట్విట్టర్ అకౌంట్ IncTelangana తోనూ సీఎంకి సంబంధం లేదని వివరించారు. రేవంత్ రెడ్డి ఆయన పర్సనల్ అకౌంట్ తో పాటు, తెలంగాణ సీఎంఓ ట్విట్టర్ అకౌంట్లను మాత్రమే ఉపయోగిస్తున్నారని స్పష్టం చేశారు. ఆ రెండు అకౌంట్లలోనూ అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేయలేదని తెలిపారు. ఈ విషయాలన్నీ లాయర్ సౌమ్యా గుప్తా రాతపూర్వకంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి అందించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున విచారణకి హాజరు కాలేరని వివరించిన న్యాయవాది, మరో నాలుగు వారాల పాటు గడువు కోరింది.

Tags:    

Similar News