కవిత కేసులో ఈడీ, సీబీఐ పై సుప్రీం అసంతృప్తి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-08-27 09:02 GMT

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. సిబిఐ, ఈడీ వరుసగా విచారిస్తున్న అవినీతి, మనీలాండరింగ్ కేసులలో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లను న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తు పురోగతిపై కోర్టు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇకపై ఆమెను అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొంది. 

కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఆమె బెయిల్ అభ్యర్థనపై స్పందించాలని ఈడీ, సీబీఐలను కోర్టు ఆదేశించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని నిరూపించేందుకు తమ వద్ద ఉన్న మెటీరియల్ ఏమిటో చూపాలని ఈడీ, సీబీఐలను విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కోరింది.

"ఈడీ, సీబీఐ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయ్యింది. ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో ఉన్నారు. సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారు. 493 మంది సాక్షుల విచారణ ముగిసిందికేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారు. కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు. కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉంది" రోహత్గీ వాదనలు వినిపించారు. ఆమెపై ఇప్పటికే రెండు ఏజెన్సీలు దర్యాప్తు పూర్తి చేశాయని చెప్పారు. రెండు కేసుల్లో సహ నిందితుడైన ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన ప్రస్తావించారు.

విచారణ సంస్థల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, కవిత తన మొబైల్ ఫోన్‌ను ఫార్మాట్ చేసిందని, ఆమె ప్రవర్తన సాక్ష్యాలను తారుమారు చేసినట్లుగా ఉందని పేర్కొన్నారు. రోహత్గీ ఆరోపణను ఆయన "బోగస్"గా అభివర్ణించారు. కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చింది. విచారణ సమయంలో కవిత సహకరించలేదు. ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేయడం సాధారణం, కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదు అని ఈడీ వాదించింది. అయితే, ఆమె నేరంలో పాల్గొన్నట్లు చూపించడానికి మెటీరియల్ ఏమిటి అని బెంచ్ ఎస్వీరాజును ప్రశ్నించింది.

ఈ రెండు కేసుల్లో తనకు బెయిల్‌ను నిరాకరిస్తూ జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టు 12న సుప్రీంకోర్టు సీబీఐ, ఈడీల నుంచి స్పందన కోరింది. ఇప్పుడు రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ప్రాథమికంగా ఒకరని పేర్కొంటూ, రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు కొట్టివేసింది.

మార్చి 15న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసం నుంచి కవితని ఈడీ అరెస్ట్ చేయగా.. ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ కవిత ఖండించారు.

Tags:    

Similar News