ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది: రేవంత్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు.;
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఎస్సీలకు తమ ప్రభుత్వం అన్ని దశల్లో, అన్ని విధాలా అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దళితులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటూనే వచ్చిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులకు అండగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ అని, ప్రభుత్వంలో ఎన్నీలకు ఎన్నో అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్దేనని రేవంత్ అన్నారు. ఎందరో దళితులకు ప్రభుత్వంలో కీలక స్థానాలను కల్పించిన ఘనమైన చరిత్ర తమ పార్టీకి ఉందని చెప్పారు.
‘‘బాబూ జగ్జీవన్రామ్కు కేంద్రంలో వివిధ శాఖల బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దేవంలోనే తొలిసారిగా ఎస్సీ వ్యక్తి దామోదరం సంజీవయ్యను సీఎంగా చేసింది కాంగ్రెస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరిగింది. దశాబ్దాలుగా సాగిన పోరాటంలో ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. 2004లో ఉషా మెహ్రా కమిీ వేసి సమస్య పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇన్నాళ్లకు నేను సీఎంగా ఉండగానే ఈ సమస్య పరిష్కారమవడం సంతోషకరం’’ అని రేవంత్ అన్నారు.
‘‘సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భం ఇది. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితున్ని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దళితుడు మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. పంజాబ్ కేసు సుప్రీం కోర్టులో సుదీర్ఘంగా కొనసాగింది. మేం అధికారంలోకి వచ్చాక ఏడుగురు జడ్జిల ముందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో మన వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశాం’’ అని తెలిపారు.
‘‘మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశాం. న్యాయనిపుణులను సంప్రదించి వన్ మెన్ కమిషన్ ను ఏర్పాటు చేశాం. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించాం. 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి 15 శాతం రిజర్వేషన్లు వారికి పంచాం. ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తాం. వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్ధిస్తున్నారు. 2026 జనగణన పూర్తి కాగానే ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. రిజర్వెషన్లు పెంచడం వాటిని సహేతుకంగా పంచడం మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా… ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం’’ అని బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.