స్ధానిక ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు డెడ్ లైన్
సెప్టెంబర్ 30వ తేదీలోగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది;
స్ధానిక ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. సర్పంచుల పదవీకాలం మొన్నటి జనవరి నెలతోనే ముగిసినా ప్రభుత్వం వివిధ కారణాలతో ఎన్నికలను నిర్వహించలేదు. ఎన్నికల నిర్వహణ విషయమై ఆరుకేసులు దాఖలయ్యాయి. ఈకేసులను విచారించిన హైకోర్టు జస్టిస్ మాధవి బెంచ్ బుధవారం తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పుప్రకారం సెప్టెంబర్ 30వ తేదీలోగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల నిర్వహణకు కేసుల విచారణలో ప్రభుత్వం 30 రోజులు గడువుకోరగ ఎన్నికల సంఘం 60 రోజుల గడువు అవసరమని కోరింది. అయితే హైకోర్టు అనూహ్యంగా 90 రోజులు గడువిచ్చింది.
సర్పంచుల పదవీకాలం ముగియటంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. దీన్ని నిరసిస్తు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పదవీకాలం ముగిసేసమయానికే ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించటం పంచాయితీరాజ్ చట్టానికి విరుద్ధమని పిటీషనర్లు వాదించారు. ప్రత్యేక అధికారులకు ఇతర బాధ్యతలు కూడా ఉండటంతో పంచాయితీల్లో సమస్యలను పట్టించుకోవటంలేదని పలువురు తమ పిటీషన్లో చెప్పారు. సకాలంలో ఎన్నికలు జరగకపోవటంతో కేంద్రప్రభుత్వం నుండి వివిధ పథకాల రూపంలో అందాల్సిన నిధులు కూడా ఆగిపోయాయన్నారు. అందుకనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయలని పిటీషనర్లు కోరారు. ఏకారణం వల్లయినా ఎన్నికలు నిర్వహించలేకపోతే పదవీకాలాన్ని పొడిగించాలని కూడా పిటీషనర్లు కోరారు.
ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తు సుప్రింకోర్టు తీర్పు ప్రకారం స్ధానికసంస్ధల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుచేసి ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవ్వటానికి మరో 30 రోజులు గడువు కావాలన్నారు.
ఎన్నికలసంఘం తరపు లాయర్ జీ. విద్యసాగర్ వాదన వినిపిస్తు రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎన్నికల ప్రక్రియ మొదలుపట్టేందుకు ఎన్నికలసంఘం సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలనిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటినుండి ఎన్నికలు నిర్వహించేందుకు రెండునెలలు పడుతుందని చెప్పారు. ఈదశలో జస్టిస్ జోక్యం చేసుకుని ప్రభుత్వం గనుక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయకపోతే ఎన్నికల సంఘమే చొరవతీసుకుని ఎన్నికలు నిర్వహించాలన్న సుప్రింకోర్టు ఆదేశాలను గుర్తుచేశారు. అందుకు విద్యాసాగర్ బదులిస్తు రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉందని తెలిపారు. మూడు వైపుల వాదను విన్న జస్టిస్ మాధవి బెంచ్ తీర్పుచెబుతు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.