నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పులులు, ఇతర వన్యప్రాణులకు నిలయంగా మారింది.నల్లమల అడవులు, కొండలు, గుట్టలు, గల గలా పారుతున్న కృష్ణా నది మధ్యన విస్తరించిన ఈ అభయారణ్యం దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వుగా పేరొందింది. 1983వ సంసత్సరంలో ఏర్పాటైన ఈ అభయారణ్యంలో పులుల సంఖ్య 87కు పెరిగింది. కోర్, బఫర్ జోన్ ఏరియాతో కలిపి 3727.82 చదరపు కిలోమీటర్లలో ఆంధ్రప్రదేశ్ రాస్ట్రంలోని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో విస్తరించింది. మార్కాపూర్, ఆత్మకూర్, నంద్యాల, గిద్దలూరు టైగర్ రిజర్వులుగా విభజించారు. రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యంలో పులుల సంచారం పెరిగింది.
పులులు ఎన్ని ఉన్నాయంటే...
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో గత ఆరేళ్లలో పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని పులుల గణనలో తేలింది. 2018వ సంవత్సరంలో 47 పులులుండగా, 2022 నాటికి వీటి షంఖ్య 74 కు పెరిగింది.2019లో 63 పులులు, 2020లో 73, 2023లో 74, 2024లో 76 పులులున్నాయని గణనలో వెల్లడైంది. 2025 నాటికి పులుల సంఖ్య 87 కు చేరింది. ఈ ఏడాది చివరిలో జరగనున్న తాజా పులుల గణనలో 2026 నాటికి నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంఖ్య 100 కు పైగా ఉండవచ్చని అంచనా వేసినట్లు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ బీవీఏ కృష్ణమూర్తి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పులుల పరిరక్షణకు వాచర్ల గస్తీ
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల కదలికలు, వాటి ఆరోగ్య స్థితి, లింగం, వాటి వయసును అంచనా వేయడానికి అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్ లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పులుల సంచారంపై పగ్ మార్కుల ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అభయారణ్యంలో పులుల పరిరక్షణకు ప్రొటెక్షన్ వాచర్లు గస్తీ తిరుగుతున్నారు. అభయారణ్యంలోని అయిదు బ్లాకుల్లో 1031 లోకేషన్లలో 2,062 కెమెరాలను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు.
జంగిల్ క్యాంపులు...
ఏపీలోని నల్లమల కొండ తూర్పు కనుమల్లో ఉన్న అతి పెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జునసాగర్ శ్రీశైలం అభయారణ్యం. మార్కాపూర్, ఆత్మకూర్, నంద్యాల, గిద్దలూరు టైగర్ రిజర్వులుగా ఉంది. రాజీవ్ గాంధీ వన్యప్రాణుల అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణుల అభయారణ్యం టైగర్ రిజర్వ్గా ఉన్నాయి. నల్లమల అటవీ అందాలు, పెద్ద దూకుడు గుండం సలేశ్వరం జలపాతాలున్నాయి. కృష్ణా నది ఈ టైగర్ రిజర్వ్ గుండా దాదాపు 270 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తుంది.బైర్లుటీ జంగిల్ క్యాంప్, పాచెర్ల, తుమ్మలబైలు , నెక్కంటి జంగిల్ రైడ్, రోళ్లపాడు అభయారణ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.నల్లమల జంగల్ క్యాంప్ బైర్లుటీ నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నుంచి 96 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరుకు 15 కిలోమీటర్ల దూరంలో, కర్నూలుకు 83 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి 289 కిలోమీటర్ల దూరంలో ఉంది. నంద్యాల రైల్వేస్టేషన్ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో నల్లమల జంగిల్ క్యాంపును సందర్శించవచ్చు. కర్నూల్ లేదా హైదరాబాద్ విమానాశ్రయంలో దిగి కూడా ఈ క్యాంపును సందర్శించవచ్చు.
పక్షులకు నిలయం
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) రాయల్ బెంగాల్ టైగర్లకు ప్రసిద్ధి చెందింది. పచ్చని చెట్లతో పాటు జంతుజాలంతో అలరారుతోంది. 80 రకాల క్షీరదాలు, 200 జాతుల పక్షులు, 54 రకాల సరీ సృపాలు, 20 ఉభయచరాలు, 55 రకాల చేపలు, 101 రకాల రంగురంగుల సీతాకోక చిలుకలు, 45 జాతుల కోలియోస్టెరాన్లు, వివిధ రకాల కీటకాలకు ఈ అభయారణ్యం ప్రసిద్ధి. ఈ అభయారణ్యంలో పులులు, చిరుతలు, మచ్చల జింకలు, సాంబార్లు, చింకారాలు, ఎలుక జింకలు, లంగూర్స్, కింగ్ కోబ్రా, ఎలుక పాము, రస్సెల్ వైపర్ పాములున్నాయి.తెలంగాణలో 200 మీటర్ల దూరం ప్రవహిస్తున్న కృష్ణానదిలో మొసళ్లు, తాబేళ్లు, వివిధ రకాల చేప జాతులు ఉన్నాయి.
రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం
రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యాన్ని 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాలో 9.37 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రోళ్లపాడు విస్తరించి ఉంది.ఈ అభయారణ్యం పక్షులు, సరీసృపాలు, క్షీరదాలకు నిలయంగా ఉంది. అంతరించిపోతున్న జాతులైన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, లెస్సర్ ఫ్లోరికాన్లకు నిలయంగా రోళ్లపాడు ప్రసిద్ధి చెందింది. రోళ్లపాడు వన్యప్రాణుల అభయారణ్యం దేశంలో అత్యంత అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంరక్షణ కోసం ఉద్దేశించారు. ప్రకృతి పరవశించేలా పచ్చని చెట్లతో కూడిన రోళ్లపాడు అభయారణ్యంలో జింకలు, తోడేళ్లు, వివిధ రకాల పక్షులు ఉన్నాయి. పక్షుల కిలకిల రావాలతో రోళ్లపాడు మార్మోగుతుంటుంది.రోళ్లపాడు అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకులకు రెండు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నయి. ఇద్దరు వ్యక్తులకు రాత్రి బస, లంచ్, డిన్నర్, అల్పాహారం, గ్రాస్ ల్యాండ్ సఫారీతో కలిపి రూ.4వేలు ధర నిర్ణయించారు.
బైర్లుటి నల్లమల జంగిల్ క్యాంప్
కర్నూలు, నంద్యాల, విజయవాడ, హైదరాబాద్ నగరాలకు సమీపంలో బైర్లుటి నల్లమల జంగిల్ క్యాంప్ సెలవులను ప్రశాంత వాతావరణంలో గడిపేందుకు అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరేందుకు వీలుగా కుటీరాల్లో పర్యాటకులు బస చేయవచ్చు. థ్రిల్లింగ్ జంగిల్ సఫారీలు, రిప్రెష్ ఎకో వాక్స్ విశ్రాంతితో పాటు సాహస యాత్రలు చేయవచ్చు.పచ్చచెట్ల మధ్య బస చేయడంతోపాటు గైడెడ్ సఫారీ రైడ్ ల చేపట్టవచ్చు. ఈ రైడ్ కార్పొరేట్ రిట్రీట్లు, టీమ్-బిల్డింగ్ కార్యకలాపాలు, కుటుంబ కలయికలు, ప్రత్యేక వేడుకలకు ఇది సరైన ప్రదేశం.నల్లమల అడవుల్లో పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పక్షుల కిలకిల రావాల మధ్య గడపవచ్చు. సఫారీ రైడ్ లో పులులు, చిరుతలు, అడవి కుక్కలు, జింకలు, పెద్ద ఉడతలు మరుపురాని మధుర అనుభూతులను మిగిలిస్తాయి.ఈ అభయారణ్యం వలస పక్షులకు నిలయం కావడంతో పక్షి వీక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఇష్టకామేశ్వరి నెక్కంటి జంగిల్ రైడ్
ఇష్టకామేశ్వరి నెక్కంటి జంగిల్ రైడ్ శిఖరంలో ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎతైన చెట్ల మధ్య అడవిలో సఫారీ ప్రయాణం పర్యాటకులకు వినూత్న అనుభూతిని మిగిలిస్తుంది. పాచెర్ల నల్లమల జంగిల్ క్యాంపును సందర్శించవచ్చు.
జాలువారుతున్న జలపాతాలు
నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో నల్లమల కొండలు, కోనల నడుమ ఎత్తిపోతల, పెద్ద దూకుడు, గుండం, చలేశ్వరం జలపాతాలున్నాయి. అమ్రాబాద్, శ్రీశ్రైలం, పెద్ద చెరువు, శివపురం, నెక్కంటో పీఠభూములున్నాయి.శ్రీశైలంలోని పురాతన దేవాలయాలు మళికార్జున స్వామి, ఆయన భార్యలైన దేవత భ్రమరాంబ, పార్వతి దేవతల తలంబ్రాలున్నాయి. భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిలింగాల్లో ఒకటిగా. పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటిగా నిలచింది. నాగార్జున విశ్వవిద్యాలయం, బౌద్ధమత విశ్వవిద్యాలయాలు, మఠాలకు ఈ ప్రాంతం నిలయంగా మారింది. గల గల పారుతున్న కృష్ణానది ఈ టైగర్ రిజర్వ గుండా 270 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అక్క మహాదేవి భిలం, దత్తాత్రేయ భిలం, ఉమా మహేశ్వరం, కదలివనం, పలంకసరి వంటి రాతి ఆశ్రయాలు, గుహ దేవాలయాలు ఉన్నాయి.
అభయారణ్యంలో బర్డ్ వాచింగ్
నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో అద్భుతమైన పక్షి జాతులకు నిలయంగా మారింది. ఉదయం వేళ పర్యాటకులు రంగురంగుల పక్షులను తిలకించవచ్చు. చేంజబుల్ హాక్ ఈగిల్, కామన్ టైలర్బర్డ్స్, ఓరియంటల్ మాగ్పీ రాబిన్స్, ఇండియన్ స్క్మిటార్ బాబ్లర్, పఫ్ థ్రోటెడ్ బాబ్లర్, వైట్ రంప్డ్ షామా, జంగిల్ బాబ్లర్స్, రెడ్ వాట్లేడ్ లాప్వింగ్స్, గ్రీన్ ఇంపీరియల్ పావురాలు, వైట్ బెల్లీడ్ డ్రోంగోస్, గ్రే హార్న్బిల్స్, ఇండియన్ రోలర్స్, రూఫస్ ట్రీపీస్, ప్యారడైజ్ ఫ్లైక్యాచర్స్, పారాకీట్స్, ఇండియన్ పీఫౌల్, గ్రే జంగిల్ఫౌల్,ఇతర పక్షులను చూడవచ్చు. వివిధ రకాల పక్షుల అరుపులను వినవచ్చు. పక్షులను చూసేందుకు పక్షి ప్రేమికులు బర్డ్ వాచింగ్ వాక్ చేస్తుంటారు.
వన్యప్రాణుల పరిరక్షణ కోసం...
వన్యప్రాణుల పరిరక్షణ కోసం అటవీశాఖ అధికారులు గుంటూరు నుంచి కర్నూల్, నంద్యాల, శ్రీశైలం ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్లు, టెంపో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.రాత్రివేళల్లో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వరకు భారీవాహనాలు, బస్సులు, ట్రక్కుల రాకపోకలు నిలిపివేశారు.డోర్నాల, శిఖరం, లింగాలగుట్ట వద్ద అటవీశాఖ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఆకురాల్చే వృక్షాలున్నాయి. లోయలు, కొండలు, గుట్టలతో వెదురు, గడ్డితో అటవీ ప్రాంతం నిండి ఉంటుంది. నల్లమలలో మూలికలు కూడా ఉన్నాయి. వివిధ రకాల చెట్లు, 353 ఔషధమొక్కలకు నల్లమల నిలయంగా మారింది.