నల్గొండ జిల్లా పానుగల్లులోని తెలంగాణ వారసత్వశాఖ మ్యూజియంలో అపురూపమైన శిల్పాలు, శాసనాలు, పరికరాలు సేకరించి, భద్రపరచివున్నాయి.
ఫోటో: మండల వెంకటేశ్
మ్యూజియం ప్రాంగణంలో నిలిపిన వీరశిలలలో ఏలేశ్వరం నుంచి తెచ్చిన, శాసనంతో కనిపించిన ఒక వీరశిలను కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యుడు వోరుగంటి వేంకటేశ్ గుర్తించాడు. ఈ వీరుడు కుడిచేత బల్లెం, ఎడమచేత డాలు ధరించి, డాకాలు ముందుమోపి శత్రువులను వధిస్తున్నాడు. అతని కాళ్ళ నడుమ శత్రువీరుడు పడివున్నాడు. మరొకరు నిలబడి పోరుచేస్తున్నాడు. వీరునికి కుడివైపు సిగ, కుండలాలు, హారగ్రైవేయకాలు, జంధ్యం, నడుమున దట్టీ, దండకడియాలు, కంకణాలు, కడియాలు, పాంజీబులు అలంకరించబడివున్నాయి.
ఈ వీరశిలపై చెక్కివున్న శాసనం 10వ శతాబ్దానికి చెందినదని, క్రీ.శ.996లో వేయించిన 21పంక్తుల తెలుగన్నడ లిపి, తెలుగుభాషాశాసనం వల్ల అరియరిమ్మ కుమారరాజ్యంలోని దవలందికి చెందిన మల్లయ కొమండివరదియ ఆనతిమేరకు కకయ్య అనే వీరుడు కాలిమడమతిప్పకుండా యుద్ధం చేసి, వీరస్వర్గమలంకరించాడని తెలుస్తున్నదని, ఈ శాసనాన్ని పవకోజు కొడుకు సరస్వత్త చెక్కాడని ఆ శాసనాన్ని చదివిన కొత్త తెలంగాణచరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.