బీసీ రిజర్వేషన్లపై ఏం చేద్దాం!
సర్కార్ ముందు 3 ప్రత్యామ్నాయాలు;
స్థానిక ఎన్నికలకు హైకోర్టు డెడ్లైన్ విధించడంతో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు చేస్తున్నది. బీసీ రిజర్వేషన్లు రేవంత్ సర్కార్ మెడకు చుట్టుకున్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ సమక్షంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ హామీనిచ్చారు. ఆ హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలని రేవంత్ సర్కార్ తెగ హైరానా పడుతోంది.
స్థానిక సంస్థల పాలక మండలి గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగిసినా, ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేసిందంటూ నల్లగొండ, నిర్మల్, జనగామ, కరీంనగర్ జిల్లాలకు చెందిన మాజీ సర్పంచులు దాఖలు చేసిన ఆరు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీ మాధవీదేవి జూన్ 25వ తేదీ బుధవారంనాడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. అందులో భాగంగా 30 రోజుల్లోగా వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభం అయింది.
అధికార పార్టీ ఇప్పుడేం చేస్తుంది?
ఇప్పట్టి వరకు తప్పించుకుంటూ వస్తున్న అధికార పార్టీ ఇప్పుడేం చేస్తుంది? BC రిజర్వేషన్లను ఖరారు చేస్తుందా? ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన హామీకి కట్టుబడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికే సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. చట్ట పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకుంటే పార్టీ తరఫున 42 శాతం సీట్లు ఇస్తామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ప్రభుత్వం.. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రెండు బిల్లులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి.
ఈ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించి, 9వ షెడ్యూల్లో చేర్చడం ద్వారా తమిళనాడుకు కల్పించినట్లే తమకు రక్షణ కల్పించాలంటూ రేవంత్ సర్కార్ ని కేంద్రాన్ని కోరుతున్నది. కానీ ఢిల్లీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదనే సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. దీంతో కోర్టు తీర్పులు, రాజ్యాంగ నిబంధనలులాంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సర్కార్ ముందు 3 ప్రత్యామ్నాయాలు
1. రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవడం. ఎందుకంటే, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బిల్లులను 3 నెలల్లోగా క్లియర్చేయాలని రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించిన సంగతి తెలిసిందే. బీసీ బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరి, మరికొద్ది రోజుల్లో 3 నెలలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో గడువు పూర్తయ్యే వరకు వేచిచూసి.. అప్పటికీ రాష్ట్ర పతి నుంచి ఎలాంటి ఆమోదం రాకుంటే సుప్రీంకోర్టు మెట్లెక్కాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
2. లోకల్బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇవ్వడం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే మొత్తం రిజర్వేషన్లు 70 శాతం చేరే అవకాశం ఉన్నది. అలా చేస్తే, న్యాయపరమైన చిక్కులు తప్పవు. అందువల్ల ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టుల్లో సవాల్చేస్తే మొత్తం ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉన్నది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం దాటరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాదు రిజర్వేషన్లు పెంచుతూ బిహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు చేసిన చట్టాల్ని రద్దు చేసింది.
దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే, సుప్రీం తీర్పు, వివిధ రాష్ట్రాల అనుభవాల నేపథ్యంలో బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కష్టమే.
3. ఈ రెండూ సాధ్యం కాకపోతే పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి.. ఎన్నికలకు వెళ్లడాన్ని ప్రభుత్వం మూడో ఆప్షన్గా పెట్టుకున్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే అధికారులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఈ మేరకు సంకేతాలిచ్చారు.
బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం
స్థానిక సంస్థల్లో బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు ఎలాగూ చట్టబద్ధంగానే వస్తాయని, మిగిలిన 20 శాతం సీట్లను పార్టీ పరంగా కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు సీనియర్ నేతలు చెబుతున్నారు. బీసీలకు 22 నుంచి 23 శాతం రిజర్వేషన్లు ఎలాగూ అధికారికంగా అమలు చేయవచ్చు. మిగిలిన 50 శాతం స్థానాల్లో 20 శాతం టికెట్లను పార్టీపరంగా బీసీలకు కేటాయించాలని సీఎం నిర్ణయానికి వచ్చినట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. అంటే సర్పంచ్ అభ్యర్థులకు అధికారికంగా పార్టీ టికెట్ల కేటాయింపు ఉండదు. కానీ అనధికారికంగా గ్రామాల్లో పార్టీ తరఫున 22 శాతం మంది బీసీ అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల ప్రకారం 22 శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుచేస్తూనే మిగిలిన 20 శాతం స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వడంతోపాటు ఎంపీపీలు, జడ్పీ చైర్పర్సన్ల ఎంపికలోనూ ఈ దామాషా పాటించాలని నిర్ణయానికి వచ్చినట్లు సీనియర్ నేత, మాజీ మంత్రి చెప్పారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు సీఎం రేవంత్ సంకేతాలు ఇవ్వడంతో, గ్రామాలవారీగా ఆశావహుల లిస్ట్ రెడీ చేస్తున్నారు.
రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలు, 70 మండలాలు ఉన్నాయి. 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో 100 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకే కేటాయిస్తారు. నాన్ ఏజెన్సీ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుకు అక్కడ ఉన్న ఎస్టీ, ఎస్సీ, బీసీల జనాభాను ప్రాతిపదికన తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు.
ప్రస్తుతం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 22 శాతం రిజర్వేషన్లను డెడికెటేడ్ కమిషన్ సిఫారసు చేసింది. జిల్లాలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు ఇందులో కొంత మార్పులు చేర్పులు జరగవచ్చు.
2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలుచేయగా, బీసీలకు పంచాయతీల్లో 22.78 శాతం, మండల పరిషత్లలో 18.77 శాతం, జిల్లా పరిషత్లలో 17.11 శాతం రిజర్వేషన్లు దక్కాయి. ఈసారి కూడా ఇంచుమించు ఆ స్థాయిలోనే సీట్లు దక్కనుండగా, పార్టీ పరంగా కేటాయించే సీట్లు అదనం కానున్నాయి.