ముఖం చాటేసిన ‘జాతిపిత’

ప్రధాన ప్రతిపక్ష నేత అయిఉండి కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మొఖం చెల్లలేదా?;

Update: 2025-06-03 08:51 GMT

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కానీ తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ మాత్రం.. ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. ఆఖరికి తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు నిర్వహించిన వేడుకల్లో కూడా కేసీఆర్ కనిపించలేదు. కేసీఆర్ అనే కాదు.. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఎక్కడా కానరాలేదు. కేటీఆర్.. విదేశీ పర్యటనలో ఉన్నారు. కవితేమో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉన్నారు. ఒక కేసీఆర్ విషయానికి వస్తే ప్రతిరోజూ మాదిరిగానే రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కూడా ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. ఆఖరికి సోషల్ మీడియా వేదికగా కూడా కేసీఆర్.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టలేదు. ఒక వాయిస్ నోట్ విడుదల చేయలేదు. అంతెందుకు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలపలేదు.

అధికారంలో ఉంటేనే రాష్ట్రంపై ప్రేమ..?

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది ఈ వేడుకల్లో సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచేవారు. ప్రతి ఏడాది కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఎలా చావు నోట్లో తలపెట్టి బయటకు వచ్చామని, ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించామని చెప్పిందే చెప్పి ఊదరగొట్టేవాళ్లు. అలాంటిది ఇప్పుడు ఈ ఏడాది రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ఎక్కడా కనిపించకపోవడం కీలకంగా మారింది. అధికారంతో పాటు కేసీఆర్‌కు రాష్ట్రంపై ఉన్న ప్రేమ ఇంతేనా? అన్న చర్చలు మొదలయ్యాయి.

ముఖం చెల్లకనే..!

జాతిపిత, తెలంగాణ కోసం తాము మాత్రమే పోరాడం అని చెప్పుకునే కేసీఆర్‌కు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత అయిఉండి కూడా కార్యక్రమాల్లో పాల్గొనడానికి మొఖం చెల్లలేదా? అందుకే ఆయన ఇలాంటి కీలక దినోత్సవం నాడు కూడా ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారం పోయిన తర్వాత తనకు ఓటేసిన ప్రజలనే మరిచిపోయిన నేత కేసీఆర్ అని, వారి సమస్యలను లేవనెత్తడానికి అసెంబ్లీకే రాని నేత.. రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనంటారని అనుకోవడం విచిత్రమంటూ మరికొందరు విశ్లేషకులు సుతిమెత్తగా చురకలంటిస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఎక్కడా కేసీఆర్ పాల్గొనకపోవడం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో జాతిపిత ముఖం చాటేశారని, అందుకు అధికారం లేదన్న దుగ్దే కారణమన్న వాదన బలంగా వినిపిస్తోంది. కానీ కొందరు మాత్రం కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పార్టీలో ఇటీవల ఏర్పడిన పరిణామాలు, సోదరుడిపై తిరుగుబావుటా ఎగరేసిన కవిత.. తండ్రికి దూరమవడం, కాళేశ్వరం కమిషన్ నుంచి నోటీసులు రావడం, ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు చుక్కెదురవుతుండం వంటి అనే అంశాలతో కేసీఆర్ మనోవేదనకు గురై ఉన్నారని, అందుకే ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్నారని కేసీఆర్‌ను వెనకేసుకొస్తున్నారు. కాగా గతేడాది అంటే 2024లో కూడా గాంధీభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కూడా పాల్గొన్నారని పార్టీ శ్రేణులు గుర్తు చేశాయి. కానీ ఈ ఏడాది ఆయన ఎందుకు పాల్గొనలేదు అన్న దానిపై మాత్రం వారి నుంచి కూడా ఎటువంటి సమాధానం రాలేదు.

Tags:    

Similar News