కేటీఆర్ తరపున కవిత ఆందోళనలు చేస్తారా?
కల్వకుంట్ల వారి ఫ్యామిలీ చిత్రం!;
భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్ ) కు తండ్రి కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ను తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించనని చెప్పిన ఎమ్వెల్సీ కవిత, ఇప్పుడు కేటీఆర్ ను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అని అంటున్నారు. అంటే ఆయన నాయకత్వాన్ని కూడా ఒప్పుకుంటున్నట్లేనా? గతంలో మీడియాను చిట్ చాట్కు పిలిచి.. కేటీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆయనకు పార్టీ నడపడం చేతకావడం లేదన్నది. బీఆర్ఎస్ చేస్తున్న పనుల్లో సగం తానే చేస్తున్నానన్నారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగుపడేది లేదని ఆమె చెప్పారు. కాని ఇప్పుడు స్వరం మారింది. అంటే కవితకు తత్వం బోధపడిందని అనుకోవాలా?
కాళేశ్వరం కమిషన్ నుండి కేసీఆర్కి నోటీసులు వచ్చినప్పుడు ఆగ్రహించిన కవిత, ఇప్పుడు కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఆగ్రహించింది. మొన్నటివరకు కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేసిన కవిత ఇప్పుడు స్వరం మార్చారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే నోటీసులు ఇస్తారా? అని రేవంత్ రెడ్డిపై మండిపడింది. తనను తాను బీఆర్ఎస్ నేతగా చెప్పుకునేందుకు ఉబలాట పడుతున్నారు. సోషల్ మీడియాలో తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్టులో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని సంబోధించింది. ఈ ట్వీట్ ఇప్పుడు హైలెట్ అవుతోంది. కేటీఆర్కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వగానే ఆయనకు మద్దతు తెలుపుతూ పలువురు బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు. కవిత కూడా పెట్టారు. చాలా సింపుల్ గా పెట్టిన ట్వీట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తుమన్నారు.
రాజకీయాలు... మహా భారతంలో శకుని పాచికల లాంటివి. వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. మొత్తం కథే మారిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు దిక్కు తోచని పరిస్థితి. ఎందుకంటే.. తాజాగా ఏసీబీ నుంచి మరోసారి కేటీఆర్కి నోటీసులు వచ్చాయి. ఫార్ములా-ఈ కారు రేసు కేసులో ఈ నోటీసులు వచ్చాయి. జూన్ 16న ఉదయం 10 గంటలకు తమ ముందుకు రావాలని ఏసీపీ తెలిపింది. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ చెప్పారు మరి. ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ.. కవిత ధర్నా చేస్తారా? తన అన్నయ్య తరపున ఆందోళనలు చేస్తారా? బీఆర్ ఎస్ ఆఫీస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రి తరపున ఆందోళనలు చేసిన కవిత.. కేటీఆర్ తరపున కూడా ధర్నా చేస్తారా తెలంగాణాలో ఇదే హాట్ టాపిక్....
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కవిత వేరు కుంపటి లాంటిది పెట్టినా.. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెబుతున్నారు. పైగా.. తన తండ్రికి అన్యాయంగా నోటీసులు పంపిస్తే.. దాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ లాంటి వారు ధర్నాలు చెయ్యట్లేదని కవిత పేరు చెప్పకుండా ఆరోపించారు. మరి ఇప్పుడు కేటీఆర్కి కూడా కక్ష పూరితంగానే ఏసీబీ నోటీసులు వచ్చాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఆయనకు సంఘీభావంగా.. కవిత ధర్నాకి దిగుతారా? ఇది ఆమెకు సమస్యగా మారింది. కేటీఆర్ తరపున ధర్నా చెయ్యకపోతే, ఆమె పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనీ, తన అన్నయ్యపై ద్వేషంతోనే ధర్నా చెయ్యట్లేదని బీఆర్ఎస్ వర్గాలు భావించే ప్రమాదం ఉంది. అలాగని ధర్నా చేస్తే, అప్పుడు ఆమె పార్టీలో భాగమైనట్లే అవుతుంది. కానీ.. అలా అవ్వడం ఆమెకు ఇష్టం లేదని, ఆమె తాజా నిర్ణయాలను చూస్తే అర్థమవుతుంది. ఇలా.. ధర్నా చేసినా, చెయ్యకపోయినా.. కవితకు రాజకీయ సవాళ్లే ఎదురవుతున్నాయి. ఆమె పరిస్థితి ముందు నుయ్యి , వెనక గొయ్యి అన్నట్లు మారింది.
కేసీఆర్ మంచివారే.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి అంటూ.. కవిత రాసిన లేఖతోనే ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్నాయి. అక్కడి నుంచే కవిత వేరు కుంపటి ప్రారంభించారు. దాని పేరే జాగృతి. ఓవైపు తాను బీఆర్ఎస్లోనే ఉంటాను అంటూనే.. మరోవైపు.. జాగృతి, బీఆర్ఎస్ తనకు రెండు కళ్ల లాంటివి అని చెప్పడం ద్వారా.. తన కుంపటి తనదే అనే సంకేతాలు ఇచ్చారు కవిత. అంతేనా.. తన సొంత అన్న కేటీఆర్ని పరోక్షంగా టార్గెట్ చెయ్యడం ద్వారా.. ఆమె యుద్ధం ఎవరిపై అనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. కేసీఆర్ తర్వాత ఆ పార్టీ వారసత్వ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ మార్పు కవితకు జీర్ణం కావడం లేదు. అందుకే ఆమె పార్టీని రెండుగా చీల్చేలా ఆమె చేస్తున్న ప్రయత్నాలు.. కేసీఆర్కి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.
ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ బయలుదేరారు. అదే సమయంలో.. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లి.. తండ్రిని ఓదార్చాలని కవిత ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పుడు తనను కలిసేందుకు కేసీఆర్ ఛాన్స్ ఇవ్వలేదు. ఆయన్ని కలుద్దామని మెట్లు ఎక్కి పైకి వెళ్లబోయిన కవిత, ఆయన లిఫ్టులో కిందికి వస్తున్నారని తెలుసుకున్నారు. కింద కలుద్దామంటే.. లిఫ్టు నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. ఇతర నేతలతో మాట్లాడుతూ వెళ్లిపోయారే తప్ప, కవిత వైపు చూడనే లేదు. తద్వారా ఆమె తీరును కేసీఆర్ తప్పుపట్టినట్లైంది. ఆమె చర్యలు పార్టీకి అభ్యంతరకరం అని కేసీఆర్ చెప్పినట్లైంది.
అక్కడ ఆమెకు అవమానం జరిగినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఎవరో పరాయి దానిలా దూరంగా.. భయం భయంగా నిలబడిపోయింది, కేసీఆర్ సైతం ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తండ్రికి బొట్టు పెట్టలేదు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు హారతి కూడా ఇవ్వలేదు. అంటే కేసీఆర్కు ఆమె పట్ల కోపం తగ్గలేదన్న మాట. కేటీఆర్ కూడా ఆమెను పట్టించుకోలేదు. ఆమెను తప్పించుకొని తిరిగాడట. దీంతో కవితకు సీన్ అర్థమైంది. తాను తండ్రితో, అన్నతో విభేదిస్తే రాజకీయంగా కవితకు కవితకు మనుగడ ఉండదని అర్థమైందని బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు. అందుకే ఆమె అన్నతో కూడా సఖ్యతగా ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనబడుతోంది. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బాగుపడేది లేదని చెప్పిన కవిత ఇప్పుడు స్వరం మార్చింది. అంటే కవితకు తత్వం బోధపడిందని అనుకోవాలా?
అమెరికా నుంచి వచ్చాక ఎమ్మెల్సీ కవిత తెగ ఆవేశపడిపోయారు. తాను తండ్రికి రాసిన లేఖ బయటపడేసరికి ఉక్రోషం ఆపుకోలేకపోయింది. కొన్ని రోజులపాటు మీడియాలో కవితకు సంబంధించిన వార్తలు, కథనాలే హల్చల్ చేశాయి. ఆమె కూడా రచ్చరచ్చ చేశారు. పత్రికల్లో, చానెల్స్ లో అనేక రకాల కథనాలు వచ్చాయి. ఆమె సొంత పార్టీ పెడుతుందని, కాంగ్రెసులో చేరుతుందని, కేసీఆర్ కుటుంబం విచ్ఛినమైపోయిందని…ఇలా కథనాలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
కవిత అమెరికా నుంచి వచ్చి చాలారోజులైపోయింది. అయినప్పటికీ ఆమె తండ్రి దగ్గరకు వెళ్లలేదు. కేసీఆర్ కూతురిని పిలవలేదు. ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. కేటీఆర్ కూడా ఆచితూచి మాట్లాడాడు. ఇక కాంగ్రెసు నాయకుల రెచ్చిపోయి రచ్చరచ్చ చేశారు. ఈలోగా కవిత తాను సొంత పార్టీ పెడుతుందేమో అనే అనుమానాలు కలిగే విధంగా జాగృతి కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. కాని తండ్రికి మాత్రం సపోర్టుగా మాట్లాడింది. కేసీఆరే తన నాయకుడు అని చెప్పింది. ఇక్కడ విషయం ఏమిటంటే కవిత కార్యక్రమాలకుగాని, ఆమె పర్యటనల్లోగాని గులాబీ పార్టీ నాయకులు ఎవరూ కనబడలేదు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులను వ్యతిరేకిస్తూ.. తన తండ్రికి సపోర్టుగా ఇందిరాపార్కులో ధర్నా చేసిన కవిత.. ఆ తర్వాత నిజామాబాద్ నియోజకవర్గంలో కూడా కొంత హడావుడి చేశారు. కానీ ఎక్కడా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆమెకు సపోర్టుగా కలవలేదు. ఎక్కడా బీఆర్ఎస్ జెండా కనిపించలేదు. పాల్గొన్న వారంతా.. జాగృతి సభ్యులే. దాంతోనే.. తనకు పార్టీ సపోర్టు లేదని కవితకు అర్థమైపోయింది.
పాపం కవిత, కేటీఆర్పై ఆగ్రహంతో రాజకీయంగా రోడు పాలయ్యారు. తెలంగాణలో కవిత ధిక్కార స్వరంతో బీఆర్ఎస్లో ఆమెకు ఆదరణ కరువైంది. కవిత ఎక్కడికైనా వెళ్లినా, ఆమెను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలుసుకోడానికి భయపడుతున్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అన్నకు, చెల్లికి పడటంలేదని కథనాలు వస్తున్నాయి. కవిత తండ్రికి లేఖ రాయడంతో విభేదాలు తారస్థాయికి చేరాయని చెబుతున్నారు. రకరకాల ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బిజెపి వ్యూహాత్మకంగా ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి బిజెపి, కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ ఎస్ను చూసి భయపడుతోంది. మొత్తం బీఆర్ ఎస్ను తన ఖాతాలోకి వేసుకుంటునే ఆధికారం సాధ్యమని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగానే పావులు కదుపుతోంది. భయపడిన కేసీఆర్ తప్పటడుగులు వేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ క్యాడర్ లో ఎక్కువ భాగం బిజెపికి సపోర్ట్ చేసింది. కేసీఆర్ కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం ఆ పార్టీ కొంప ముంచిందని చెప్పవచ్చు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఎలా వుందంటే బిజెపితో పొత్తు పెట్టుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తేనే మనుగడ వుంటుందని లేక పోతే ఓట్లు చీలిపోయి మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఫార్మూలా... కూటిమిగా ఏర్పడి, ఇక్కడ తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి చావుదెబ్బ కొట్టేలా బిజెపి అధిష్టానం ఆలోచిస్తోంది. తనను జైల్లో పెట్టిన బిజెపి సంకనెక్కుతారా అంటూ కవిత ఆవేశపడటం సహజమే. చక చక మారిపోతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. కవిత లిక్కర్ స్కాం కేసులో ఇరుక్కుంది. ఇది కూడా బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడతాయి. ఫలితం గత లోక్సభ ఎన్నికల్లో చూశాం. బీజేపీ, కాంగ్రెసు బలమైన పోటీ ఇస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమవుతుంది. ఇది కేసీఆర్ ఊహించారు. అవసరమైతే బిజెపితో కూటమి కట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు కాంగ్రెస్ కు వస్తే మరికొన్ని బీజేపీకి దక్కుతాయి. మరికొన్ని బీఆర్ఎస్ కు వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకే బిజెపి బీఆర్ ఎస్పై దృష్టి పెట్టింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుగడలు వేస్తుంది. కవితను తమ పార్టీలో చేర్చుకోకుండా వేరే పార్టీ పెట్టేలా వెనుక నుంచి డ్రామా నడుపుతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నిజంగానే కవిత పార్టీ పెడితే బీఆర్ ఎస్ ఓట్లు ఏ మేరకు చీలుతాయి అనేది ఇప్పుడిప్పుడే చెప్పడంలో అర్థం లేదు. తెలంగాణా రాజకీయాల్లో ఏ పార్టీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుంది? ఫలితాలు ఎలా ఉంటాయనేది త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత క్లారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు.