బర్రెలు, గొర్రెలతో నిండిన గాంధీభవన్..
తమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క నేత కూడా లేకపోవడం అన్యాయమంటూ వారు నిరసన బాట పట్టారు.;
హైదరాబాద్లోని గాంధీభవన్ను కుర్మ, యాదవ సామాజిక వర్గ ప్రజలు ముట్టడించారు. గాంధీభవన్లోకి భారీ సంఖ్యలో గొర్రెలు, బర్రెలను తోలి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర క్యాబినెట్లో, పీసీసీ కార్యక్రమంలో ఎక్కడా కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించి ఒక్క నేత కూడా లేకపోవడం అన్యాయమంటూ వారు నిరసన బాట పట్టారు. ఇటీవల కాంగ్రెస్ సర్కార్.. మంత్రివర్గ విస్తరణ చేసింది. అయినప్పటికీ అందులో తమ సామాజిక వర్గం నేతలు ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని వారు తెలిపారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. సంక్షేమ సంఘం నేత శ్రీహరి యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ను కలిసే వరకు తమ నిరసన కొనసాగుతుందని నేతలు తెలిపారు.
గాంధీ భవన్లో భద్రతా వైఫల్యమా..!
కుర్మ, యాదవ సామాజిక వర్గాల వారు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించనున్నట్లు ముందుగానే పోలీసులు సమాచారం అందింది. దాంతో సోమవారం ఉదయం నుంచే గాంధీ భవన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ గొర్రెలు, బర్రెలు ఉన్న లారీలు లోపలికి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇది భద్రతా వైఫల్యమేనని కొందరు విమర్శిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా.. అంత భద్రత ఉన్నా లారీలు ఎలా లోపలికి వచ్చాయో చెప్పాలంటూ అధికారులను వివరణ కోరుతున్నారు.
తదుపరి విడతలో సాధ్యమయ్యేనా..!
40 లక్షలకు పైగా వున్న యాదవ, కురుమలకు మంత్రి పదవి ఇవ్వాలంటౌ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల చేపట్టిన విస్తరణలో ముగ్గురు మంత్రులను మాత్రమే నియమించారు. దీంతో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీ సమయంలోనైనా తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మంత్రి పదవి ఇవ్వాలని కురుమ, యాదవులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరి వచ్చే విడత మంత్రి వర్గ విస్తరణలో వీరికి అవకాశం దక్కుతుందేమో చూడాలి.
యాదవులు చేసిన డిమాండ్లు ఏంటంటే..
- మంత్రి వర్గంలో యాదవులకు స్థానం కల్పించాలి
- జనాభా ప్రకారం రాష్ట్ర, జిల్లా పదవుల్లో ప్రాధాన్యత
- ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి
- ప్రభుత్వ కార్పొరేషన్, నామినేటికి పదవుల్లో అవకాశం
- రూ. 10వేల కోట్లతో యూదవ, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
- గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వాలి.
- నట్టల మందులను తక్షణం విడుదల చేయాలి.
- తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల రెగ్యులేటరీ మార్కెట్ తక్షణమే ఏర్పాటు చేయాలి.
- 50 సంవత్సరాలుపైబడిన గొర్రెల కాపరులకు 6,000 రూపాయల పింఛన్ అందించాలి.
- కాపరులకు ఇచ్చే పరిహారం 10 లక్షలకు పెంచాలి.
- తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వంద కోట్ల ఎన్పీడీసీ రుణాలు వెంటనే మాఫీ చేయాలి.
- తెలంగాణాలో ఉన్న ప్రతి గొర్రె, మేకకు ఇన్ఫూరెన్స్ అందివ్వాలి.
- ప్రతి నియోజకవర్గంలో గొర్రెల, మేకల మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి.
- జిల్లాకో మీట్ ప్రాసెసింగ్ యూనిటీ నిర్మించాలని డిమాండ్ చేశారు.