‘సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం’

'థగ్ లైఫ్' మూవీ రిలీజ్‌పై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్..;

Update: 2025-06-17 12:50 GMT
Click the Play button to listen to article

కమల్ నటించిన 'థగ్ లైఫ్'('Thug life') మూవీ రిలీజ్ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటిస్తామని కర్ణాటక(Karnataka) ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy CM D K Shivakumar) మంగళవారం పేర్కొన్నారు.

"మనం అత్యున్నత న్యాయస్థానం ఆదేశాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరికీ పరిమితులు ఉంటాయి. మనం కూడా మన పరిమితుల్లో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కన్నడ భాషాప్రేమికులంతా దయచేసి ప్రశాంతంగా ఉండండి. మనం కోర్టును గౌరవించాలి. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు" అని డీకే విజ్ఞప్తి చేశారు.

ఇంతకూ 'థగ్ లైఫ్' గొడవేమిటి?

మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ వహించిన 'థగ్ లైఫ్' ('Thug life') మూవీ దేశవ్యాప్తంగా జూన్ 5న విడుదలైంది. కాని కర్ణాటక(Karnataka)లో మాత్రం విడుదల కాలేదు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సందర్భంగా చెన్నైలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో కమల్ చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అన్న మాటతో కన్నడ నాట తీవ్ర దుమారమే రేగింది. కన్నడ భాషాభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేసి కమల్ ఫోటోలను దహనం చేశారు. కమల్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఆయన చిత్రాన్ని ప్రదర్శనకు అనుమతించని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) తేల్చి చెప్పింది. దీంతో కమల్ కర్ణాటక హైకోర్టు(Karnataka High Court)ను ఆశ్రయించారు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. "ఒక్క క్షమాపణ చెబితే సమస్య పరిష్కారం అయ్యేది" అని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పటికి కూడా కమల్ వెనక్కు తగ్గలేదు. క్షమాపణ చెప్పడానికి ససేమిరా అన్నారు.

ఈ నేపథ్యంలో 'థగ్ లైఫ్' సినిమాను ప్రదర్శనకు అనుమతించాలని కోరుతూ మహేష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తులు ఉజ్జల్ భుయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రేక్షకుల తలపై తుపాకి పెట్టి సినిమా చూడకుండా ఆపలేమని వ్యాఖ్యానిస్తూ..సినిమా విడుదలకు వెంటనే అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూవీ రిలీజ్ గురించి 24 గంటల్లో తమకు సమాచారం ఇవ్వాలని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ స్పందించారు. 

Tags:    

Similar News