Cabinet Meeting | ‘ఆర్థికవ్యవస్థ పణంగాపెట్టి మేడిగడ్డ నిర్మాణం’
పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.;
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై పీసీ ఘోష్ అందించిన నివేదికపై తెలంగాణ మంత్రివర్గం సోమవారం భేటీ అయింది. కమిషన్ నివేదికతో పాటు పలు ఇతర అంశాలపై కూడా తెలంగాణ క్యాబినెట్ చర్చలు చేసింది. కాగా ఇందులో కమిషన్ నివేదికను మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి గత ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్ట్ను నిర్మించిందని చెప్పారాయన. బీఆర్ఎస్ పాలకులు అధిక వడ్డీలకు రూ.84 వేల కోట్ల అప్పు తీసుకొచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
చెప్పినట్లే విచారణ చేయించాం: ఉత్తమ్
‘‘రూ.38వేల కోట్లతో తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ చేపట్టాల్సి ఉండగా దానిని మేడిగడ్డకు మార్చారు. భారీగా తెచ్చిన అప్పులతో చేపట్టిన కాళేశ్వరం.. బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ చేయిస్తామని గతంలోనే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ చేపట్టాం. రాజకీయ అంశాలు జోడించకుండా విచారణ జరపాలని కోరాం. 660 పేజీలతో నివేదికను కమిషన్ నీటిపారుదల శాఖకు ఇచ్చింది. నివేదికను ముగ్గురు అధికారుల కమిటీ 25 పేజీలతో సంక్షిప్తం చేసింది. 2016లో మేడిగడ్డ ప్రాజెక్టు అగ్రిమెంట్ జరిగింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. బ్యారేజ్ కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ నిర్మాణంలో ప్లానింగ్, డిజైన్లో లోపాలున్నాయని తేలింది. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులోనూ ఇదే సమస్య ఉందని కమిటీ వెల్లడించింది. మూడు బ్యారేజీల్లో నీటి నిల్వకు అవకాశం లేదని తెలిపింది’’ అని ఉత్తమ్ వెల్లడించారు.
అసెంబ్లీలో అన్ని వివరాలు పెడతాం: సీఎం రేవంత్
‘‘ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసీఆర్ రీడిజైనింగ్ పేరుతో మార్పులు చేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మూడేళ్లల్లోనే మేడిగడ్డ కుంగడం, అన్నారం పగలడం జరిగింది. ప్రణాళిక, నిర్మాణ, నిర్వహణ లోపాలు ఉన్నాయని ఆనాడు కెసీఆర్ కు నిపుణులు నివేదిక అందించారు. లక్ష కోట్లుపెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోవడంపై.. అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ చేపడతామని ప్రజలకు ఆనాడు మాట ఇచ్చాం.. ఇచ్చిన మాట ప్రకారం 14.03.2023 న అపార అనుభవం ఉన్న పీసీ ఘోష్ చైర్మన్ గా జ్యుడీషియల్ ఎంక్వైరీ కమిషన్ నియమించాం’’ అని తెలిపారు.
‘‘16 నెలల తరువాత జూలై 31 న 665 పేజీల నివేదికను పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించింది. నివేదిక సారాంశాన్ని తయారు చేసి కేబినెట్ కు అందించాలని ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఊరు మార్చి, పేరు మార్చి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం కూలిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ లో ఆమోదించాం. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకుంటాం. త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళుతుంది. బీఆరెస్ కమిషన్ ఈ రిపోర్టును తప్పుపట్టడం సహజమే’’ అని అన్నారు.
‘‘నివేదిక వారికి అనుకూలంగా ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా మాట్లాడటం వారికి అలవాటే. కమిషన్ నివేదికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదు. ఇది ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక. నివేదిక సారాంశం, అందరి సూచనల ప్రకారమే చర్యలు ఉంటాయి. రాజకీయ కక్ష పూరిత చర్యలకు పాల్పడం. నివేదికపై అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళతాం’’ అని అన్నారు.
ఉత్తమ్ రెడ్డి చెప్పిన మరిన్ని కీలక అంశాలు..
- ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు
- పీసీ ఘోష్ కమిషన్ 660 పేజీల రిపోర్టు ఇచ్చారు
- కాళేశ్వరం కోసం తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టారు..
- అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం కూలింది
- మేడిగడ్డ కుంగిన తర్వాత ప్రాజెక్టును పరిశీలించాం
- 2016లో మేడిగడ్డ బ్యారేజ్ అగ్రిమెంట్ జరిగింది
- మేడిగడ్డ కుంగినప్పుడు సీఎం కేసీఆరే నీటిపారుదల శాఖ మంత్రి
- నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ప్లానింగ్, డిజైన్, కన్ స్ట్రక్షన్ లోపాలున్నాయని రిపోర్టు ఇచ్చింది
- మేడిగడ్డ కుంగడానికి కారణాలు చెప్పింది
- కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ ప్లానింగ్, నిర్మాణం, మెయింటెనెన్స్ అన్నీ జరిగాయి
- 7 డిసెంబర్ లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి కమ్యూనికేట్ చేశాం
- NDSA (నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ) టెక్నికల్ ఎక్స్ పర్ట్ కమిటీ ఇంక్వైరీ చేసింది
- మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మూడు బ్యారేజీలలో నీళ్లు నిలిపే ఛాన్స్ లేదని రిపోర్ట్ ఇచ్చింది
- 2025 జులై 31 జస్టిస్ ఘోష్ రిపోర్టు ఇచ్చారు
- 660 పేజీల రిపోర్టును సమ్మరైజ్ చేసేందుకు ముగ్గురు మెంబర్ల కమిటీ వేశాం.
- కేబినెట్ ముందు పెట్టి వివరించడం జరిగింది
- కాళేశ్వరం కోసం అధికవడ్డీకి రూ.84 వేల కోట్లు ఖర్చు చేశారు
- అధిక వడ్డీలకు NBFC ల దగ్గర అప్పు తెచ్చారు
- తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు.. అందుకే మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడం అనే వాదనలో వాస్తవం లేదన్న ఘోష్ కమిషన్
- 2015లో ఆనాటి కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి.. తెలంగాణకు లేఖ రాసింది..
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మడిహెట్టి దగ్గరనీళ్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు
- 205 టీఎంసీల నీళ్లు ఉన్నాయని,75 శాతం నీటి లభ్యత ఉందని లేఖలో చెప్పారు
- తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు షిఫ్ట్ చేస్తున్నామనేది ఒక సాకు మాత్రమే
- బీఆర్ఎస్ ప్రభుత్వం 5 మంది రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్ కమిటీ వేసింది..
- వారు వేసిన కమిటీనే.. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని రిపోర్టు ఇచ్చింది..
- డబ్బులు వృధా అవుతాయని కూడా చెప్పింది..
- ఎక్స్ పర్ట్ కమిటీ రిపోర్టును తొక్కిపెట్టారు
- అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల మంత్రి హరీష్ రావు.. ఉద్దేశపూర్వకంగానే రిపోర్టును నెగ్లెక్ట్ చేశారు..
- సీడబ్లూసీ.. తుమ్మిడిహెట్టిదగ్గర, మేడిగడ్డ దగ్గర నీళ్లున్నాయని చెప్పింది..
- కానీ తుమ్మిడెహెట్టి దగ్గర నీళ్లు లేవని ప్రాజెక్టును షిఫ్ట్ చేశారు
- బ్యారేజీలు వాటర్ స్టోరేజీకి కాకుండా.. వాటర్ డైవర్షన్ కోసమే వినియోగిస్తాం
- ఎక్కువ నీళ్లు ఎక్కువ రోజులు స్టోర్ చేయడంతో బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయి
- పబ్లిసిటీ కూడా ఒక కారణం అని తేల్చిన ఘోష్ కమిషన్
- ప్రతి చిన్న విషయంలో ఆ నాటి ముఖ్యమంత్రి రాజకీయ జోక్యం చేసుకోవడం కారణంగానే బ్యారేజ్ లు డ్యామేజ్ కు గురయ్యాయి
- రీ ఇంజినీరింగ్ అనేది ఆనాటి ముఖ్యమంత్రి సొంత నిర్ణయాలే కారణం