మరో మూడు రోజులు వర్షాలే వర్షాలు..

ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-08-16 08:05 GMT

తెలంగాణక మరో మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాకుండా రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై అన్ని జిల్లాల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లోనే ఇంటి నుంచి బయటకు రావాలని సీఎం సూచించారు. అదే విధంగా అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, భూపాలపల్లి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటితో పాటుగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, వికారాబాద్, వరంగల్, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో కూడా ఒకమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక వ‌ర్ష‌పాతం, మిగ‌తా జిల్లాల్లో సాధార‌ణ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని సీఎం తెలిపారు. నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వికారాబాద్‌, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావ‌ర‌ణ శాఖ సూచ‌న‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ఉదయం ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతార‌ని సీఎం తెలిపారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోత‌ట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.

నీటి పారుద‌ల శాఖ అధికారులు, సిబ్బంది రిజ‌ర్వాయ‌ర్లు, చెరువులు, కుంట‌ల నీటి మ‌ట్టాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ నీటి విడుద‌ల‌పై ముందుగానే క‌లెక్ట‌ర్లు, క్షేత్ర స్థాయి సిబ్బందికి స‌మాచారం ఇవ్వాల‌ని పేర్కొన్నారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవ‌ల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిషేధించాల‌ని.... పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి స‌మీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌న్నారు. నిరంత‌రాయంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో వ‌ర్ష‌పు నీరు నిల్వ ఉండి దోమ‌లు, ఇత‌ర క్రిమికీట‌కాలు విజృంభించి అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉందని గుర్తుచేశారు.

న‌గ‌ర‌, పుర‌పాల‌క‌, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ త‌గినంత మందులు అందుబాటులో ఉంచుకోవాల‌ని... అవ‌స‌ర‌మైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సీఎం సూచించారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప‌శు న‌ష్టం చోటుచేసుకోకుండా జాగ్ర‌త్త‌లు వ‌హించాల‌ని సీఎం తెలిపారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయ‌తీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య‌, పుర‌పాల‌క‌, పోలీస్‌, అగ్నిమాప‌క శాఖ‌లు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స‌మ‌న్వ‌యంతో సాగాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే విన‌తుల‌కు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క శాఖ సిబ్బంది త‌క్ష‌ణ‌మే స్పందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News