కవితకు మరో ఎదురుదెబ్బ.. కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది.

Update: 2024-03-23 10:19 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని మరో మూడు రోజులు పొడిగించింది. గతంలో విధించిన వారం రోజుల కస్టడీ ఈరోజుతో ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, మరో ఐదు రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. క‌విత ఫోన్ డేటాను తొలిగించిన‌ట్లు త‌మ ద‌ర్యాప్తులో తేలింద‌ని కోర్టుకి తెలియజేశారు. ప్రస్తుతం క‌విత బంధువుల ఇంట్లో సోదాలు జ‌రుగుతున్నాయ‌ని ఈడీ పేర్కొంది.

వాదనలు ముగిసిన అనంతరం మరో మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈనెల 26 వరకు ఆమె ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. కోర్టులోకి వెళ్లే ముందు కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. గతంలో అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడుగుతున్నారని వెల్లడించారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కవిత కస్టడీ కూడా పొడిగించిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News