కవిత, మనీష్ సిసోడియా ల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియా ల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

Update: 2024-07-03 09:37 GMT

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియా ల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. బుధవారంతో గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో... దర్యాప్తు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఇద్దరి కస్టడీని జూలై 25 వరకు పొడిగించారు. దీంతో తదుపరి విచారణ జులై 25 కి వాయిదా పడింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉపశమనం దొరుకుతుందేమో అని ఎదురు చూస్తున్న కవితకి, పార్టీ శ్రేణులకు ప్రతిసారీ నిరాశే మిగులుతోంది. లిక్కర్ కేసులో అరెస్టైన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను ఈ నెల 1 న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చెప్పలేమని తేల్చి చెప్పేసింది. విద్యావంతురాలిగా, పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలంటించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితకి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే అంశం ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని, మరికొందరు నిందితులు కూడా ఆమె తరపునే పని చేసినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెని నిస్సహాయ మహిళగా భావించలేమంటూ... కవిత బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. 

Tags:    

Similar News