డాక్టర్లు ఇంత నిర్దయగా వ్యవహరించారా ?

‘ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్ చూపించాలన్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే పోలీసు అధికారులు వచ్చి చెబితేనే వైద్యంచేస్తామని కచ్చితంగా చెప్పారు’.;

Update: 2025-05-31 07:31 GMT
Gulzar fire accident

‘అత్యవసరంగా వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కాళ్ళుపట్టుకున్నా డాక్టర్లు కనికరించలేదు..ఇక్కడ లాభంలేదని ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన వెంటనే ముగ్గురూ అక్కడ చనిపోయారు’..కన్నీళ్ళతో మృతుని తరపున కుటుంబసభ్యులు చేసిన తాజా ఆరోపణలు. ఈనెల 18వ తేదీన ఓల్డ్ సిటీ గుల్జార్ హౌసు ఏరియాలో రెండస్తుల ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదం(Gulzar fire accident)లో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మరణించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో అగ్నిప్రమాదం జరిగిన కారణాలపై రకరకాల ప్రచారాలు, ఆరోపణలు, సంజాయిషీలు చక్కర్లుకొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇన్నిరోజుల తర్వాత ఆ కుటుంబపెద్ద, మృతిచెందిన ప్రహ్లాద్ మోది కూతురు సంతోష్ గుప్తా, ఆమె కుమారుడు నితీష్ మీడియాతో మాట్లాడారు.

‘ఆసుపత్రికి బాధితులను తీసుకెళ్ళినపుడు ఏమి జరిగిందో నితీష్ మాటల్లోనే ‘అంబులెన్స్ లో ముగ్గురిని తీసుకుని బయలుదేరాను’... ‘ప్రభుత్వ ఆసుపత్రికి కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళమని అడిగితే అంబులెన్స్ డ్రైవర్ అంగీకరించకుండా ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్ళాడు’..‘అప్పటికి ముగ్గురూ బతికేఉన్నారు..ముగ్గురిని స్ట్రెచర్ మీద లోపలకు తీసుకెళ్ళి వైద్యం చేయాలని డాక్టర్లను అడిగితే కుదరదన్నారు’..‘ప్రమాదం జరిగినట్లు ఎఫ్ఐఆర్ చూపించాలన్నారు. ఎఫ్ఐఆర్ లేకపోతే పోలీసు అధికారులు వచ్చి చెబితేనే వైద్యంచేస్తామని కచ్చితంగా చెప్పారు’. ‘ముగ్గురు ప్రాణాపాయస్ధితిలో ఉన్నారు ముందు వైద్యం మొదలుపెట్టామని కాళ్ళుపట్టుకున్నా డాక్టర్లు కనికరించలేదు’...‘15 నిముషాలు ఎంతబతిమలాడినా వైద్యంచేసేదిలేదని డాక్టర్లు చెప్పారు. దాంతో చేసేదిలేక మలక్ పేటలోని యశోదా ఆసుపత్రికి తీసుకెళ్ళాము. అప్పటికి ముగ్గురూ చనిపోయారు’ అని నితీష్ చెప్పాడు.

నీతీష్ మాటలు చాలా బాధాకరమనే చెప్పాలి. నిజానికి ఎఫ్ఐఆర్ లేదా మెడికో లీగల్ సర్టిఫికేట్ లేకుండానే ఆసుప్రతికి వచ్చిన రోగులకు వెంటనే వైద్యం చేయటం డాక్టర్ల ప్రాధమిక బాధ్యత. ఒకపుడు పోలీసులు వచ్చి చెప్పేంతవరకు ప్రమాదాల్లో ఆసుపత్రులకు వచ్చిన రోగులకు చికిత్స చేయకూడదనే నిబంధన ఉండేది. అయితే తర్వాత అన్నీ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాత సుప్రింకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రులు రోగులకు వైద్యం అందిస్తున్నాయి. అగ్నిప్రమాద బాధితుల విషయంలో ఉస్మానియా ఆసుపత్రి(Osmania hospital) వైద్యులు ఎందుకింత నిర్దయగా వ్యవహరించారో తెలీదు.

నితీష్ తల్లి సంతోష్ గుప్తా మాట్లాడుతు అగ్నిమాపక శాఖపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ‘తమ కుటుంబంలో 17 మంది చనిపోవటానికి ఫైర్ డిపార్ట్ మెంటు సరిగా స్పందించకపోవటమే కారణ’మన్నారు. ‘మంటలను ఆర్పటానికి వచ్చిన ఫైర్ ఫైటర్స్(Fire Fighters) దగ్గర సరైన పరికరాలు లేవ’ని ఆరోపించారు. ‘ఫైర్ ఇంజన్లో సరిపడా నీళ్ళలేవు, ట్యూబులకు రంద్రాలుండటంతో నీరంతా వృధాపోయింది, ఆక్సిజన్ మాస్కులు లేవు, సిబ్బంది దగ్గర కనీసం టార్చ్ లైట్లు కూడా లేవ’ని మండిపోయారు. ‘తలుపులు, గోడలు పగలగొట్టేందుకు సిబ్బంది దగ్గర కనీసం అవసరమైన పరికరాలు కూడా లేవ’న్నారు. ‘తమదగ్గర సరైన పరికరాలు లేకపోవటంతో బాధితులను కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ఏమాత్రం ప్రయత్నించలేద’న్నారు. ‘ఉదయం 6.45 గంటలకు ఫైర్ ఇంజన్లతో వచ్చినా 8.04 గంటలవరకు వాళ్ళు ఏమీ చేయలేకపోయారు’ అంటు తీవ్రంగా మండిపడ్డారు.

ప్రమాదం ఎన్నిగంటలకు జరిగింది ?

ఉదయం 5.55 గంటలకు పొగవాసన వస్తుండటంతో తాను నిద్రలేచినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల్లో కొందరిని అప్రమత్తం చేసి పొగలు ఎక్కడినుండి వస్తున్నాయో చూసేందుకు సోదరితో పాటు తాను బయటకు వచ్చినట్లు తెలిపారు. సోదరితో కలిసి తాను కింద అంతస్తులోకి వెళితే మరో నలుగురు పైకి వెళ్ళనిట్లు సంతోష్ చెప్పారు. అప్పటికే మొదటి అంతస్తునుండి దట్టమైన పొగలు వస్తున్నాయని, అదేసమయంలో పెద్ద శబ్దంతో ఆవరణలో మంటలు కమ్ముకున్నట్లు గుర్తుచేసుకున్నారు. 6.16కి ఫైర్ డిపార్ట్ మెంటుకు ఫోన్ చేసి విషయంచెప్పి బాధితులు ఎక్కువమంది ఉన్నారని, కనీసం 10 అంబులెన్సులు పంపించమని కోరినట్లు సంతోష్ తెలిపారు.

6.45 గంగలకు ఒక ఫైర్ ఇంజిన్ వచ్చినా నీరు సరిపడా లేకపోవటం, ట్యూబుకు రంద్రాలుండటంతో నీరు ప్రెషర్ తో పైకి చిమ్మలేకపోయిందన్నారు. కనీసం వారిదగ్గర టార్చిలైట్లు కూడా లేకపోవటంతో తమనే టార్చిలైట్లు తెమ్మని ఫైర్ సిబ్బంది అడిగినట్లు తెలిపారు. చుట్టుపక్కల వాళ్ళు కొందరు ఇంట్లోకి వెళ్ళేందుకు ప్రయత్నించారుకాని ఫైర్ సిబ్బంది మాత్రం సరైన సమయంలో ఇంట్లోకి వెళ్ళలేకపోయినట్లు ఆమె ఆగ్రహంవ్యక్తంచేశారు. నితీష్ తో పాటు స్ధానికులు కొందరు ధైర్యంచేసి ఇంట్లోకి వెళ్ళి కొంతమందిని బయటకు తీసుకొచ్చి అంబులెన్సుల్లోకి చేర్చినట్లు ఆమె చెప్పారు. అయితే అంబులెన్సుల పరిస్ధితి మరీ దారుణంగా ఉందన్నారు. ఒక్క అంబులెన్సులో ఆక్సిజన్ లేదని, బాధితులకు సిబ్బంది కనీసం సీపీఆర్ కూడా చేయలేదన్నారు.

ఆక్సిజన్ లేదని, ఫైర్ ఇంజన్లలో నీళ్ళులేవని గతంలోనే కుటుంబసభ్యులు చేసిన ఆరోపణలను అప్పట్లోనే ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న అన్నీ ఫైర్ ఇంజన్లలో నీళ్ళున్నాయని, ట్యూబులు కూడా మంచివే అని డీజీ వివరించారు. ఇదే సమయంలో అంబులెన్సులు అన్నింటిలోను ఆక్సిజన్ పరికరాలు ఉన్నట్లు వైద్యశాఖ డైరెక్టర్ రామచంద్రనాయక్ అప్పట్లోనే స్పష్టంచేశారు. ప్రతి అంబులెన్సులోను ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు ఉన్నాయని వివరణ ఇచ్చారు. ఇపుడు కొత్తకోణం ఏమిటంటే ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు కొనప్రాణంతో కొట్టుకుంటున్న ముగ్గురు బాధితులకు వైద్యం చేయటానికి నిరాకరించారని నితీష్ చెప్పటమే. పైగా ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల కమిటి తమతో మాట్లాడనేలేదని మండిపడ్డారు. మొత్తం ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఢిల్లీలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సేఫ్టి, రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాసినట్లు సంతోష్, నితీష్ చెప్పారు.

Tags:    

Similar News