కార్యకర్తలను నాయకులు చేద్దాం.. బీఫార్మ్ ఇస్తే సిపాయిలౌతారు -కేసీఆర్ ప్రకటన

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా మూడో రోజు కూడా పార్టీ నేతలతో భేటీ నిర్వహించారు.

Update: 2024-06-27 13:50 GMT

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా మూడో రోజు కూడా పార్టీ నేతలతో భేటీ నిర్వహించారు. ఎంపికచేసిన నియోజకవర్గాలవారీగా ముందస్తు సమాచారంతో నిర్దేశిత సమయం ప్రకారం అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు నేతలతో ఆయన వరుస సమావేశాలు పెడుతున్నారు. అందులో భాగంగా నేడు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు జహంగీర్, దుండిగల రాజేందర్, చైర్మన్లు, సర్పంచులు, తదితర ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. వారితోపాటు హాజరైన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యం కోసం ప్రారంభమైన 15ఏండ్ల ఉద్యమ ప్రయాణం గమ్యాన్ని చేరుకుని తిరిగి స్వయంపాలన అనే గమనంలో దేశానికే ఆదర్శవంతమైన పాలననందిస్తూ స్వరాష్ట్రంగా పదేండ్ల అనతికాలంలోనే మరో ఉదాత్తమైన లక్ష్యాన్ని చేరుకుందన్నారు. తన 25 ఏండ్ల ప్రజా ప్రస్థానం ఇక్కడితో ఆగిపోలేదని, అయిపోలేదని మరెన్నో గొప్ప లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగాల్సి ఉందని కేసీఆర్ అన్నారు.

ఆరు దశాబ్దాలపాటు దిక్కు మొక్కు లేక ఒక అదెరువు లేక కొట్టుమిట్టాడిన తెలంగాణను దరికి చేర్చేందుకు, నాడు ఉద్యమ కేతనమై ఎగిరిన గులాబీ జెండా రెపరెపలు... తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసె దాకా కాంగ్రెస్ పాలనలో అన్నిరంగాల్లో ఆగమైతున్న తెలంగాణను అక్కున చేర్చుకుని మల్లా గాడిలో పెట్టేదాకా, కొనసాగుతూనే ఉంటుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన. అంతటి ఉదాత్తమైన లక్ష్యంకోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని కేసీఆర్ అన్నారు. 

“తెలంగాణ సాధించేనాటికి మనది సమైక్యపాలనలో దిక్కు మొక్కు లేని పరిస్థితి. సాగునీరు తాగునీరు కరెంటు వంటి అనేక కీలక వసతులను కల్పించుకున్నాం. తీర్చిదిద్దుకున్నాం. పదేండ్ల అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన ప్రగతిని సాధించుకున్నాం. ఇటువంటి కీలక సమయంలో వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఊహించని తీర్పునిచ్చారు. కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటి తమాషాలు జరుగుతుంటాయని చరిత్రలోకి వెళితే అర్థమౌద్ది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అలవిగాని హామీలను నమ్మి ప్రజలు అనూహ్యంగా మోసపోయారు. పాలిచ్చే బర్రెను వొదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు అయింది” అని పల్లెల్లో ప్రజలు బాధపడుతున్నారు” అని కేసీఆర్ పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన అనేక పథకాలు తమకు అందట్లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారని కేసీఆర్ అన్నారు. సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, రైతుబంధు అందట్లేదన్నారు. తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా కావట్లేదన్నారు. ఇవన్నీ ప్రజల మనసుల్లో రికార్డ్ అవుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి దరికి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారితప్పిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఎటువంటి ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు.

“మన 25 ఏండ్ల సుధీర్ఘ ప్రయాణం ఆగలేదు, అయిపోలేదు. నాడు ఎన్టీఆర్ ని తిరిగి ఎట్లైతే ప్రజలు గద్దెమీద కూర్చోబెట్టారో అంతకన్నా గొప్పగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరిగి ఆదరిస్తారని, అంతకంటే రెట్టింపు మద్దతుతో మనలను గద్దె మీద కూర్చుండ బెట్టే రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రోజురోజుకు దిగజారుతున్నదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నిచ్చెన మెట్లు ఎక్కేది పోయి మొదటి దశలోనే మెట్లు దిగజారుకుంటూ వస్తున్నదని విమర్శించారు.

పార్టీ అనేది నాయకులను సృష్టిస్తదని, నాయకులు పార్టీలోకి వచ్చి పోతుంటారని, కొంతమంది నాయకులు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి ఎటువంటి తేడా రాదని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలున్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని, బీఆర్ఎస్ పార్టీ బీ ఫార్మ్ ఇచ్చి అవకాశమిస్తే ఎవరైనా సిపాయీలుగా తయారౌతారని కేసీఆర్ తెలిపారు. ప్రజల్లో చైతన్యం వచ్చి తమకు కాంగ్రెస్ ద్వారా జరిగిన మోసాన్ని గుర్తించి తిరిగి బీఆర్ఎస్ ను ఆదరిస్తారని అప్పటిదాకా ఓపికతో ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని, పట్టుదలతో ప్రజల నడుమనే జీవించాలని కార్యకర్తలకు అధినేత పిలునిచ్చారు.


Tags:    

Similar News