‘బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తాం’
డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.;
బీజేపీ ఎంపీ రఘునందన్ రావును సోమవారం సాయంత్రంలోపు చంపేస్తామంటూ ఫోన్ కాల్ వచ్చింది. పీపుల్స్ వార్ మావోయిస్ట్ పేరుతో వచ్చిన ఈ బెదిరింపు ఫోన్ కాల్ ప్రస్తుతం సంచలనంగా మారింది. తాను మధ్యప్రదేశ్కు చెందిన మావయిస్ట్నంటూ ఆగంతుకుడు తెలిపాడు. ఈ ఫోన్ను రఘునందన్ రావు పీఏ ఆన్సర్ చేశారు. బెదిరింపు గురించిన తెలిసిన అనంతరం ఆయన సెక్యూరిటీ హైఅలెర్ట్ అయింది. అదే విధంగా ఈ ఫోన్ కాల్పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కగార్ ఎఫెక్టేనా..?
అయితే ఛత్తీస్గఢ్, తెలంగాణ మధ్య ఉన్న అడవుల్లో ఆపరేషన్ కగార్ జోరుగా సాగుతోంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతమొందిస్తామని, మావోయిస్ట్ రహిత భారత్ను నిర్మిస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు తెలిపింది. ఇందుకు బీజేపీ నేతలంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. తాజాగా వర్షాలు పడినా, చలి పెరిగినా ఆపరేషన్ కగార్కు బ్రేకులు పడవని, ఇదే వేగంతో భద్రతా బలగాలు ముందుకు వెళ్తాయని అధికారులు వెల్లడించారు. దీంతో చేసేదేమీ లేకే..మావోయిస్టులు బీజేపీ ఎంపీకి బెదిరింపు ఫోన్ కాల్స్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.
తెలంగాణ నేతే ఎందుకు..?
ఆపరేషన్ కగార్ కారణంగా శాంతి చర్చలకు రావాలని మావోయిస్ట్లు కోరారు. అందుకు కేంద్రంలోని బీజేపీ ససేమిరా అని సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా చర్చల గురించి మాట్లాడించారు. వాటిలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. తెలంగాణలోని పలువురు మంత్రులు, సీఎం కూడా మావోయిస్టులతో చర్చలకు రావాలని, హింస పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. దీంతో తెలంగాణలో మావోయిస్టులకు కాస్తంత అనుకూల వాతావరణం కనిపించిందని, అందువల్లే ఇక్కడ ఉన్న బీజేపీ నేతకు బెదిరింపులు పంపాలని ఫిక్స్ అయి అందుకు రఘునందన్ రావును ఎంచుకున్నారని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ బెదిరింపు ఫోన్ కాల్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్ వచ్చిన నెంబర్ను ట్రేస్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.