తెలంగాణలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు, కరోనావ్యాప్తిపై కంగారు పడొద్దు

తెలంగాణలో మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ కేసులు వచ్చినా తగ్గుతుందని, దీనిపై ఆందోళన చెందవద్దని వైద్యనిపుణులు చెప్పారు.;

Update: 2025-05-29 12:30 GMT
మళ్లీ ప్రబలుతున్న కోవిడ్

దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరుగుతోంది. గురువారం నాటికి రాష్ట్రంలో మూడు కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు.అంటువ్యాధి అయినా కోవిడ్ నేడు ఎండోమిక్ గా మారినందున, దీని తీవ్రత తగ్గిందని ఆయన తెలిపారు. గతంలో తాము వేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరిగిందన్నారు.


స్వల్ప లక్షణాలతో పెరుగుతున్న కోవిడ్ కేసులు
కోవిడ్ కేసుల సంఖ్య అత్యధికంగా కేరళ, మహారాష్ట్ర,గుజరాత్, ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే 430కి పైగా యాక్టివ్ కోవిడ్ కేసులు వెలుగుచూశాయి.దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు కొత్త సబ్ వేరియంట్లు ఎన్ బీ.1.8.1, ఎల్ ఎఫ్.7 కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న కోవిడ్ కేసుల వల్ల భయపడాల్సిన పని లేదని,పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.కోవిడ్ వైరస్‌ తీవ్రత తగ్గడంతో ఈ వైరస్ సోకిన వారు ప్రస్తుతం ఇంటివద్ద చికిత్స పొందుతున్నారని వైద్యశాఖ అధికారులు చెపుతున్నారు.చాలా మంది స్వల్ప లక్షణాలతో ఇళ్లలోనే ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు.

కోవిడ్ వల్ల ప్రమాదం లేదు...
కోవిడ్‌ వల్ల ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదని, వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా, హాస్పిటలైజేషన్ అసలు లేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు. కోవిడ్ వ్యాప్తిపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.తుమ్మినా దగ్గినా డ్రాప్ లెట్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. మాస్కులు ధరించాలని వైద్యులు కోరారు.

దీర్ఘకాలిక జబ్బులున్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి
దీర్ఘకాలిక జబ్బులైన డయాబెటీస్, గుండె, ఊపిరితిత్తులు,లివర్, కిడ్నీ సమస్యలున్న వారు కోవిడ్ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న రోగులకు కోవిడ్ సోకితే వారికి అంత తేలికగా తగ్గదని ఆయన తెలిపారు. అందుకే దీర్ఘకాలిక జబ్బులున్న వారు, వృద్ధులు, గర్భిణులు, పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

కోవిడ్ పై నిరంతరం పరిశోధనలు
కోవిడ్‌పై తమ పరిశోధనలు నిరంతరం కొనసాగుతున్నాయని,సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌ నందికూరి, బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అభిషేక్ అరోరా వెల్లడించారు. వివిధ దేశాల్లో అప్పుడప్పుడు కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, క్రమంగా వాటంతట అవే తగ్గిపోతున్నాయని వారు తెలిపారు. కోవిడ్ వచ్చిన విషయం కూడా ప్రజలకు తెలియడం లేదన్నారు.

ఇమ్యూనిటీ వచ్చింది...
దేశంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని వారు వివరించారు.కోవిడ్ పరిస్థితి సాధారణంగా ఉండడం వల్ల, కేంద్ర ఆరోగ్యశాఖ కూడా ఇప్పటివరకూ ఎలాంటి అడ్వైజరీ, గైడ్‌లైన్స్ విడుదల చేయలేదని బీబీనగర్ ఎయిమ్స్ డైరెక్టర్ అభిషేక్ అరోరా చెప్పారు.



 కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిల్స్

కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగుల శాంపిళ్లను కోవిడ్ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని హైదరాబాద్ సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ డైరెక్టర్లు కోరారు. దీంతో తాము సేకరించిన కోవిడ్ శాంపిళ్లను సీక్వెన్సింగ్ కోసం సీసీఎంబీకి పంపించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌ రవీందర్ నాయక్‌ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్ వార్డు ప్రారంభించామని, వైద్యులను అప్రమత్తం చేశామని ఆయన వివరించారు.

కోవిడ్ వ్యాక్సిన్ అవసరం లేదు...
కోవిడ్ -19 మళ్లీ ప్రబలుతున్నా, దీని నివారణకు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ సిఫార్సు చేసిందని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెపు అప్పయ్య చెప్పారు. కోవిడ్ కేవలం ఎండోమిక్ అని, ఇది అంత ప్రమాదకరం కాదని వైద్యునిపుణులు చెప్పారు.కోవిడ్ వైరస్ పై ఇమ్యూనిటీ పెరిగినందున ఈ వైరస్ వల్ల ముప్పు లేదని చెప్పారు. కోవిడ్ కేసులు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఇంకా టెస్టు కిట్లు కూడా అందుబాటులోకి తీసుకురాలేదు. మరో వైపు దీనికి వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు.

సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరిగిన రోగుల రద్దీ
తెలంగాణలో వర్షాలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వైరల్ జ్వరాలు పెరుగుతున్నాయని వైద్యనిపుణులు చెప్పారు. సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ రోగుల సంఖ్య పెరిగింది. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌, మునిసిపల్ విభాగాల అధికారులను అప్రమత్తం చేయాలని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ నుంచి ప్రత్యేక వైద్య బృందాలను పంపించి ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.సీజనల్ వ్యాధులతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి కోరారు.కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. డెంగీ వ్యాప్తి చెందుతున్నందున ప్లేట్ లెట్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు.


Tags:    

Similar News