జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్ధితి ఏమిటి ?
ఇక్కడ ఉపఎన్నిక ఎందుకు అవసరం అయ్యిందంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాధ్ మరణించారు;
ఎప్పుడు జరుగుతుందో కచ్చితంగా తెలీదుకాని ఆరుమాసాల్లోపు అయితే జూబ్లిహిల్స్ అసెంబ్లీకి ఉపఎన్నికయితే జరగాల్సిందే కదా. ఇక్కడ ఉపఎన్నిక ఎందుకు అవసరం అయ్యిందంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన మాగంటి గోపీనాధ్ మరణించారు. ఎంఎల్ఏ చనిపోయారు కాబట్టి ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గంలో గెలవటం బీఆర్ఎస్ కు అత్యంత ప్రిస్టేజిగా మారిపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందని కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) పదేపదే చెబుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్(BRS) కు 100 సీట్లలో గెలుపు ఖాయమని అంటున్నారు. సో, రేవంత్ ప్రభుత్వం మీద జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్న విషయం నిజమే అని రుజువుచేయాలంటే ఇక్కడ కచ్చితంగా బీఆర్ఎస్ ను గెలిపించుకోవాల్సిందే. అంతాబాగానే ఉందికాని పార్టీ అభ్యర్ధి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయా ?
జూబ్లిహిల్స్ నియోజకవర్గం(Jubilee hills segment)లో 2014లో గోపి గెలిచింది టీడీపీ తరపున. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో గోపి టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగానే గెలిచారు. ఇపుడు విషయం ఏమిటంటే రెండువరస ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపుకు ఐదు కారణాలున్నాయి. అవేమిటంటే మొదటిది కమ్మ సామాజికవర్గం ఓట్లన్నీ గోపికి సాలిడుగా మద్దతుగా నిలవటం. రెండో కారణం ఏమిటంటే సీమాంధ్రుల ఓట్లు ఎక్కువగా గోపీకి పడటం. మూడోకారణం ఏమిటంటే గోపి సినీనిర్మాత కూడా కావటంతో సినీఫీల్డు ఓట్లలో అత్యధికం గోపీకి పోలయ్యాయి. నాలుగోకారణం ఏమిటంటే టీడీపీ ఓటుబ్యాంకు ఓట్లలో మెజారిటి గోపీకే పోలవ్వటం. ఇక ఐదో కారణం ఏమిటంటే ముస్లింఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడకుండా వ్యూహాత్మకంగా ఎంఐఎం పార్టీ అభ్యర్ధిని పోటీచేయించి ముస్లిం ఓట్లను చీల్చటం. బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఉన్న స్నేహం కారణంగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతిచ్చేది.
ఇన్నికారణాలు సానుకూలమైతేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచేది. ఇపుడు పైన చెప్పుకున్న ఐదు పాయింట్లలో చాలావరకు బీఆర్ఎస్ కు మైనస్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉంది. కాబట్టి ఎంఐఎం మద్దతు, ముస్లింఓట్ల మద్దతు ఓట్ల మద్దతు బీఆర్ఎస్ కు ఉండదు. ఇదే సమయంలో సీమాంధ్ర ఓట్లు, టీడీపీ మద్దతుదారుల ఓట్లు, సినిమా ఫీల్డు ఓట్లు, కమ్మ సామాజికవర్గం ఓట్లు బీఆర్ఎస్ కు పడేది అనుమానమే. కాబట్టి తొందరలో జరగబోయే ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు అంతవీజీ కాదు.
అయితే, రకరకాల కారణాలతో గెలుపు ఓటములను పక్కనపెట్టస్తే ఉపఎన్నికలో బీఆర్ఎస్ పోటీచేయటం అయితే ఖాయం. అందుకనే టికెట్ కోసం కొందరు నేతలు పోటీపడుతున్నారు. ఇదేసమయంలో పార్టీ నాయకత్వం కూడా బీఆర్ఎస్ తరపున అభ్యర్ధిగా ఎవరుపోటీచేస్తే గెలుపు అవకాశాలు ఉన్నాయనే విషయమై సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. మాజీ ఎంఎల్ఏ పీ. విష్ణువర్ధనరెడ్డి, రావుల శ్రీధరరెడ్డి, మాజీమంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొడుకు తలసాని సాయికిరణ్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. సాయికిరణ్, విష్ణు తమకు టికెట్ ఇస్తే గెలుపు ఖాయమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరించినట్లు కారుపార్టీ నేతలు చెబుతున్నారు.
సానుభూతి వర్కవుట్ అవుతుందా ?
ఇదేసమయంలో ఉపఎన్నికలో సానుభూతి వర్కవుట్ అవుతుందా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గోపీకి మృదుస్వభావిగా పేరుంది. కాబట్టి ఉపఎన్నికలో గోపి భార్య సునీతకు టికెట్ ఇస్తే ఎలాగుంటుంది అనే విషయమై అధినేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. సానుభూతి వర్కవుట్ అయ్యేది అనుమానమే అనే టాక్ పార్టీలో నడుస్తోంది. ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో 2013లో లాస్యా నందిత గెలిచింది. అయితే గెలిచిన నెలరోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. తర్వాత జరిగిన ఉపఎన్నికలో నందిత చెల్లెలు లాస్య నందినికి టికెట్ ఇచ్చి పోటీచేయించారు. సానుభూతి ఓట్లతో పార్టీ ఈజీగా గెలుస్తుందని కేసీఆర్(KCR) అనుకున్నారు. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీగణేష్ గెలిచారు. అంటే ఎంఎల్ఏ మరణం తాలూకు సెంటిమెంట్ ఇక్కడ పనిచేయలేదు. ఇదేపద్దతిలో జూబ్లిహిల్స్ లో మాత్రం సానుభూతి పనిచేస్తుందా అనే చర్చ పార్టీ నేతల మధ్య జరుగుతోంది.
ముస్లింలే డిసైడింగ్ ఫ్యాక్టరా ?
సుమారు 3.7 లక్షల మంది ఓటర్లున్న ఈనియోజకవర్గంలో ముస్లిం ఓట్లు సుమారు 1.20 లక్షలున్నాయి. ముస్లిం ఓట్లలో మెజారిటి ఎవరికి అనుకూలంగా పోలవుతుందో ఆ అభ్యర్ధికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎస్సీ, బీసీ(యాదవ), రెడ్డి, కమ్మ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలీదు కాని అన్నీ పార్టీల్లో టికెట్ కోసం పోటీ అయితే మొదలైపోయింది. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.