బ్యాగ్లో డెడ్ బాడీ..
ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది? అందులో ఉన్న యువతి ఎవరు?;
హైదరాబాద్ బాచుపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీకి చెందిన నిర్మానుష్య ప్రాంతంలో ఓ నల్లటి బ్యాక్ పడేసి ఉంది. దాని నుంచి భరించలేని దుర్వాసన వస్తోంది. దీంతో అనుమానం రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు డైల్ చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కాసేపు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించి, బ్యాగ్ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆ దుర్వాసనను భరించలేకపోయారు. ఈ బ్యాగు వెనక ఏదో మతలబు ఉందని ఫిక్స్ అయ్యారు. తీరా ఓపెన్ చేస్తే అంతా షాకయ్యారు. ఆ బ్యాగ్లో ఓ యువతి మృతదేహం దర్శనం ఇవ్వడమే అందుకు కారణం. ఆ డెడ్ బాడీ కుళ్లిన స్థితిలో ఉంది. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసలు ఆ బ్యాగ్ అక్కడికి ఎలా వచ్చింది? అందులో ఉన్న యువతి ఎవరు? అన్న అంశాలను కనుక్కునే పనిలో పడ్డారు.
కాలనీలోని అన్ని సీసీటీవీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు యువతి హత్య ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడ చేశారు? మృతదేహాన్ని సూట్కేసులో పెట్టి ఇక్కడికి తెచ్చి ఎందుకు పడేశారు? ఇలా అనే కోణాల్లో దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. మృతురాలికి 25-30 ఏళ్ల వయసు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆమె మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్ ధరించి ఉంది. వెంటనే మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. యువతి హత్య మూడు నుంచి నాలుగు రోజుల క్రితం జరిగి ఉంటుంది.
బాల్నగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంలు ఏర్పడి.. మృతురాలి ఆచూకీ, హత్య చేసిన వారి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మహిళ ఎవరు, ఏంటి అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ ఎవరనేది గుర్తిస్తే నిందితులు ఎవరనేది దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇద్దరు వ్యక్తులు అనునాస్పదంగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో తిరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు సంబంధించిన ఏమైనా వస్తువులు సూట్కేసులో ఉన్నాయా? లేకపోతే ఆమె వస్తువువు ఎవరి దగ్గర ఉన్నాయి? అంత పకడ్బందీగా హత్య చేయడానికి గల కారణం ఏంటి? వంటి అంశాలపై ఫోకస్ పెట్టినట్లు అధికారులు చెప్తున్నారు.