టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలక పరిణామం
వన్ టైం యూజబుల్ పద్దతిలో నిందితుడి పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని సుప్రింకోర్టు ఆదేశించింది;
మొత్తానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు ఏ1 టీ ప్రభాకరరావు సిట్ విచారణకు హాజరవుతున్నారు. ఈనెల 5వ తేదీన తాను విచారణకు హాజరవుతున్నట్లు నిందితుడు సిట్ అధికారులకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. వన్ టైం యూజబుల్ పాస్ పోర్టు అందుకున్న మూడురోజుల్లో సిట్ విచారణకు హాజరవ్వాలని సుప్రింకోర్టు ప్రభాకరరావును ఆదేశించిన విషయం తెలిసిందే. వన్ టైం యూజబుల్ పాస్ పోర్టని సుప్రింకోర్టు ఎందుకు చెప్పిందంటే నిందితుడి పాస్ పోర్టును హైకోర్టు ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల శాఖ రద్దుచేసింది కాబట్టే. పాస్ పోర్టు లేకుండా తన క్లైంట్ అమెరికా(America) నుండి ఇండియాకు ఎలా రాగలరని నిందితుడి తరపున లాయర్ సుప్రింకోర్టులో అడిగారు. దాంతో తాత్కాలికంగా అంటే వన్ టైం యూజబుల్ పద్దతిలో నిందితుడి పాస్ పోర్టును తిరిగి అప్పగించాలని సుప్రింకోర్టు ఆదేశించింది.
సుప్రింకోర్టు ఆదేశాలతో ప్రభాకరరావు అమెరికాలోని ఇండియా రాయబార కార్యాలయానికి వెళ్ళారు. కోర్టు ఉత్తర్వులను సంబంధిత అధికారులకు అందించారు. దాంతో వన్ టైం యూజబుల్ పాస్ పోర్టును విదేశీ రాయబార కార్యాలయం నిందితుడికి అందించినట్లు సమాచారం. దాంతో ప్రభాకరరావు అమెరికా నుండి ఇండియాకు 4వ తేదీన రాబోతున్నారు. అందుకనే 5వ తేదీన విచారణకు హాజరవుతున్నట్లు సిట్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. బీఆర్ఎస్(BRS) హయాంలో ప్రభాకరరావు ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా పనిచేశారు. అప్పట్లో బీఆర్ఎస్ అధినేత ప్రత్యర్ధులకు చెందిన వేలాది ఫోన్లు(Telephone Tapping) ట్యాపయ్యాయి. రాజకీయ ప్రత్యర్దులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సెలబ్రిటీలు, కొందరు జడ్జీలు, వాళ్ళ కుటుంబసభ్యులతో పాటు పార్టీలోని అనుమానిత నేతల మొబైల్ ఫోన్లు కూడా ట్యాపయ్యాయి.
ప్రతిపక్షంలో ఉన్నపుడే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని రేవంత్(Revanth), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) లాంటి వాళ్ళు చేసిన గోలను పట్టించుకోలేదు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి(Revanth) ముఖ్యమంత్రి కాగానే టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సిట్ విచారణకు ఆదేశించారు. దాంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు ట్యాపింగ్ అంశంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ, అడిషినల్ ఎస్పీ, డీసీపీ ర్యాంకులో పనిచేస్తున్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు, రాధాకిషన్ లను అరెస్టుచేశారు. విచారణలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే తాము వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు అంగీకరించారు. ఇదే కేసులో కేసీఆర్ కు సన్నిహితుడు, ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా అధినేత శ్రవణ్ రావును పోలీసులు విచారించారు. శ్రవణ్ కూడా ప్రభాకరరావు లాగే విదేశాలకు పారిపోయి ఏడాదితర్వాత ఇండియాకు తిరిగొచ్చి సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు.
దాదాపు 14 మాసాల తర్వాత సిట్ అధికారులు, సీఐడీ అధికారులు చేసిన అనేకరకాల ప్రయత్నాల తర్వాత ప్రభాకరరావు చివరకు ఇండియాకు రాబోతున్నారు. నిందితుడిని అరెస్టుచేయద్దని, విచారణలో కఠినంగా వ్యవహరించవద్దని సిట్ అధికారులను సుప్రింకోర్టు గట్టిగా ఆదేశించింది. సుప్రింకోర్టు రక్షణతో ఇండియాకువచ్చి సిట్ ముందు హాజరుకాబోతున్న ప్రభాకరరావు విచారణలో ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సిందే.