సింగరేణిని కాపాడుకునేందుకు మరొక సకలజన సమ్మె అవసరం...

సిరుల సింగరేణి తెలంగాణకే సొంతం కావాలి. ప్రవేటీవకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ సమ్మెకు పిలుపునిచ్చాయి. దానికి ప్రజాస్వామిక వాదులంతా మద్దతు తెలపాలి.

Update: 2024-06-30 03:00 GMT

- రమణాచారి

అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు కోల్ ఇండియాను , తెలంగాణలో ఉన్న సింగరేణిని గనులను వేలం పాట ద్వారా ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 1200 కోట్ల ఖర్చుతో నూతనంగా కనుగొన్న ఆరు బొగ్గు బ్లాక్ లను వేలం పాటలో అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కార్మిక సంఘాలు ఐక్యంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని సంఘాలు కలసి జులై 1 రోజున నిరసన ప్రకటించాలని నిర్ణయించాయి

భారత ప్రభుత్వ రంగ సంస్థలలోకి అతిపెద్ద బొగ్గు రంగ సంస్థ కోల్ ఇండియా. 1971 సంవత్సరం నుండి 8 రాష్ట్రాలలో విస్తరించి ఉన్నబొగ్గు ఆధారిత పరిశ్రమలన్నింటికి ఖనిజాన్ని అందిస్తున్నది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోల్ ఇండియాకు ఘనమైన చరిత్ర ఉంది. 2013వ సంవత్సరం నుండి ఈ సంస్థకు సి ఎస్ ఆర్ ఎక్సలెన్స్ లీడర్షిప్ అవార్డు, బ్లూ డార్ట్ మోస్ట్ కేరింగ్ అవార్డులను భారత ప్రభుత్వం ప్రకటిస్తూ వచ్చింది.

కోల్ ఇండియాలో ఉన్న సంస్థలలో సింగరేణి అత్యధిక ఎక్సలెన్స్ అవార్డులు తీసుకున్నది. నష్టాలు వస్తున్నాయనే సాకుతో కొత్తగా భూగర్భగనులకు అనుమతులు ఇవ్వడం లేదు. వేలంపాటలో బొగ్గు బ్లాకులను /గనులను దక్కించుకున్న కార్పొరేట్ సంస్థలకు 50వేల కోట్ల రూపాయల ప్రోత్సాహాన్ని ఇచ్చి కోల్ ఇండియాను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. దేశవ్యాప్తంగా 255 భూగర్భగనులు, 175 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. భూగర్భ గనుల సంఖ్యను నానాటికి తగ్గిస్తూ, ఓపెన్ కాస్ట్ గనులకు అనుమతులిస్తూ, వాటిని ప్రైవేటీకరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నది.

గత 20 సంవత్సరాలనుండి సింగరేణి లో ఒక్క భూగర్భగనిని ప్రారంభించలేదు. బొగ్గు రంగ సంస్థ లను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మార్పు చేసి పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టింది. తెలంగాణలో సింగరేణికి రావలసిన బొగ్గు బ్లాకులుసత్తుపల్లి,శ్రావణపల్లి,కోయగూడెం, కళ్యాణ్ ఖని తదితర బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేసింది. దీనికి నిరసనగా కార్మిక వర్గం తిరగబడి, పోరాటం చేయడంతో తాత్కాలికంగా నిలుపుదల చేసింది.

నూతన ఆర్థిక సంస్కరణల వేగం పుంజుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వాలు సంరక్షకులుగా ఉండాలి. కానీ, యజమానులుగా భావించి దేశ విదేశీ సంస్థలకు వీటిని కారు చౌకగా కట్టబెడుతున్నారు.ఈ కారణంగా కార్మికులు రోడ్డున పడుతున్నారు. నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. గడిచిన 9 ఏళ్లలో ఒక్క బ్లాకు కూడా వేలం వేయలేదని, ఏ నెలాఖరులోగా వేలం నిర్వహించాలని,ఒకవేళ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే, తామే వేలం చేపడతామని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. ఇందుకు తెలంగాణాకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వం వహించడం విషాదకరం.

ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి వేలం పాటను నిలిపివేయాలని, సింగరేణిని రక్షించాలని రాజకీయాలకతీతంగా ఉద్యమ బాట చేపడుతున్నారు. విదేశీ బొగ్గు సుంకాన్ని ఎత్తివేస్తూ, ప్రైవేట్ బొగ్గు సంస్థల యాజమాన్యాలకు తమ ఇష్టమైన ధరలకు బొగ్గును విక్రయించే అధికారం ఇవ్వడంతో కోల్ ఇండియా సంస్థ తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. సింగరేణిలో ఒకప్పుడు ఒక లక్షా పదహారు వేల మంది పనిచేస్తూ 20 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసేవారు. నేడు సుమారు 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరింది. అంటే నాలుగు రెట్లు ఉత్పత్తి పెరిగినందుకు కార్మికుల సంఖ్య కూడా దరిదాపు 5 లక్షలకు పెరగాల్సి ఉంది. కానీ నూతన ఆర్థిక సంస్కరణల కారణంగా కార్మికుల సంఖ్య కేవలం 35 వేల కే పరిమితం కాగా,25 వేలమంది ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు.

సింగరాయపల్లి,ఇల్లందు సమీప గ్రామం లో మొదటగా బొగ్గు ఖనిజం బయటపడ్డది. ఆరంభంలో ఉత్పత్తి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండగా 23 డిసెంబర్ 1920 లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి కే పరిమితం కాకుండా 1925 నుండి విద్యుత్పత్తిలో భాగమైంది. నేడు రామగుండం, పాల్వంచ, జైపూర్, భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ల ద్వార విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి ప్రైవేటీకరణ ఆత్మహత్య సదృశ్యమే కాగలదు.

1981లో సింగరేణిలో 56 రోజులు జరిగిన చాత్రాత్మక సమ్మె, భారతీయ రైల్వేలో 1974 లో జరిగిన అతి పెద్ద కార్మికుల సమ్మె తర్వాత అతిపెద్ద కార్మిక వర్గ నిరసనఇది. పలు సందర్భాల్లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని, కాంట్రాక్టర్ రద్దు చేయమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా టెండర్లను రద్దు చేయలేదు.

బొగ్గు ఖనిజాన్ని పెద్ద మొత్తంలో తక్కువ కాలంలో కార్మికుల ప్రమేయం తగ్గించి, యంత్రాల ద్వారా వెలికి తీసేందుకు ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపడుతున్నారు. వీటి వలన ఆయా గ్రామ ప్రాంతాలలో వందల మీటర్ల లోతున తవ్వడం వల్ల బొందల గడ్డలుగా మారుతున్నాయి. మట్టి గుట్టలుగా ఏర్పడటం వల్ల పంటలు పండడం లేదు. భూములు కోల్పోవడం వల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతున్నది. దుమ్ము,ధూళి గాలి ప్రభావం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. నిర్వాసిత్వ సమస్య ప్రబలంగా పెరుగుతూ వస్తున్నది. మూలవాసులు ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల కావడం వల్ల పునరావాసం కూడా పెనుసవాలుగా మారుతుంది.

అత్యధిక జనాభా గల దేశం లో ఉపాధి మార్గాలను అన్వేషించాల్సి పోయి, సింగరేణిలో యంత్రాల ద్వారా ఉత్పత్తి జరగడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. నూతనంగా భూగర్భగనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిపితే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అందుకే బహుళ జాతి కంపెనీలకు, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే ప్రైవేటీకరణ విధానాలను ప్రజలు, కార్మిక సంఘాలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి.

ఈ ప్రాంతాల నుండి వెలికి తీసిన ఖనిజాన్ని ఇక్కడి పరిశ్రమలకు గాని,అభివృద్ధి కానీ ఉపయోగ పడాలి .కానీ దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. ఈ అభివృద్ధిలో ప్రజలకు భాగస్వామ్యం ఉండడం లేదు. ప్రజలు జీవించే హక్కు కూడా భంగం కలుగుతుంది. అందుకే అభివృద్ధిగా ప్రచారం జరుగుతున్న దీనిని బుద్ధి జీవులు విధ్వంసక అభివృద్ధిగా అభివర్ణిస్తున్నారు. విధ్వంసం ఎన్నటికీ అభివృద్ధి కాదు అని పాలకుల చర్యలను ప్రశ్నించే, నిరసించే ప్రజలపైన, రచయితల పైన,కార్మికుల పైన, కవుల పైన, మేధావుల పైన, బుద్ధి జీవుల పైన పాశవిక చట్టాలు విరుచుకు పడుతున్నాయి. పౌర, ప్రజాస్వామికవాదులు గొంతు విప్పాల్సిన సందర్భం ఇది.
























Tags:    

Similar News