పార్టీ వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ ఫుల్ ఫోకస్..
శ్రీధర్ బాబు... వంశీ మధ్య ప్రోటోకాల్ వివాదం కూడా చర్చ.;
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. పార్టీ వ్యవహారాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే బుధవారం ఆమె పార్టీ నేతలతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. హైదర్గూడలోని క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. అంతేకాకుండా పలు జిల్లాల లోక్సభ స్థానాల నేతలతో కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో కూడా ఆమె భేటీ అయ్యారు. జగ్గారెడ్డితో కూడా ఆమె పలు అంశాలపై చర్చించారు. పార్టీలోని పరిస్థితులు, పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతల వ్యవహారం ఇలా అనేక అంశాలైపై చర్చించారు. దాంతో పాటుగా ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ మహిళా వింగ్ అధ్యక్షురాలు సుమిత్రరావు చేసిన ఆరోపణలపై కూడా పార్టీ నాయకుల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. పార్టీ నేతలతో భేటీ పూర్తయిన అనంతరం ఆమె.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డితో కూడా సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సమీక్ష లో పార్టీ అంతర్గత వ్యవహారాలపై ఇంచార్జి ఆరా తీశారు. మంత్రి శ్రీధర్ బాబు...ఎంపీ వంశీ మధ్య గ్యాప్, ఇటీవల శ్రీధర్ బాబు... వంశీ మధ్య ప్రోటోకాల్ వివాదం. పెద్ద సమస్య కాదు... కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అవుతుందని ఎమ్మెల్యేలు సూచించారు. సన్నబియ్యం.. యువ వికాసం పథకాలు ప్రభుత్వానికి మంచిపేరు తెస్తున్నాయని కూడా ఎమ్మెల్యేలు పేర్కొన్నట్లు సమాచారం. పార్టీ సమన్వయంతో పని చేస్తూ... పథకాలు జనంలోకి తీసుకెళ్లాలని ఇంచార్జి ఆదేశించారు.
ఈ క్రమంలోనే మీనాక్షితో జరిగిన సమావేశంలో పార్టీ కార్యకర్తల మీద ఫోకస్ పెట్టాలని జగ్గారెడ్డి సూచించారు. అనంతరం పార్టీలోని సమస్యల గురించి చర్చించారు. చెప్పడం ఇష్టం లేకుంటే లేఖ రూపంలో ఇవ్వొచ్చని ఆమె వివరించారు. ప్రస్తుతం పార్టీలో ఉన్న సమస్యలపై అతిత్వరలో రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్, ఇన్ఛార్జ్ మీనాక్షి కూర్చుని నిర్ణయాలు తీసుకుంటారని, అంతా సెట్ చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.